Jonnagiri Mine: బంగారం.. ఈ పేరు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోంది. చమురు తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకునే మెటల్ ఇదే. ప్రతీ ఏటా దాదాపు 800 నుండి 1,000 టన్నుల బంగారాన్ని విదేశాల నుండి కొనుగోలు చేస్తోంది. ఇకపై ఆ కష్టాలు తీరినట్టే. ఎందుకంటే మార్కెట్లోకి ఏపీ బంగారం అడుగుపెట్టనుంది.
దేశంలో బంగారం కష్టాలు తీరినట్టే
స్వాతంత్ర్యం తర్వాత దేశంలో మొట్టమొదటి ప్రైవేటు బంగారు గనికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు వచ్చేనెల (మే) ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంగ్లీష్ బిజినెస్ పత్రిక ఓ కథనాన్ని వెల్లడించింది.
జియో మైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న జొన్నగిరి గోల్డ్ మైన్స్ వల్ల దేశంలో బంగారం ఉత్పత్తిని బలోపేతం చేయనుంది. అంతేకాదు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది. ఏపీలోని కర్నూలు జిల్లా జొన్నగిరి, ఎర్రగుడి, పాగిదిరాయి గ్రామాలను కలుపుకొని దాదాపు 598 హెక్టార్లలో బంగారం మైన్స్ విస్తరించింది.
వచ్చేనెల నుంచి మార్కెట్లోకి ఏపీ పసిడి, ఉత్పత్తి ప్రారంభం
ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది సదరు సంస్థ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ గనిని మే నెలలో ప్రారంభించి దేశానికి అంకితం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదొక శుభవార్తగా వర్ణిస్తున్నారు మార్కెట్ వర్గాలు.
జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన డెవలపర్గా వ్యవహరిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులో త్రివేణి ఎర్త్మూవర్స్-డెక్కన్ గోల్డ్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రయోగాత్మక దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే సుమారు 40 నుండి 60 కిలోల బంగారాన్ని వెలికి తీసినట్టు తెలుస్తోంది.
ఉత్పత్తి ప్రారంభమైన తొలి ఏడాది సుమారు 400 నుండి 500 కిలోల పసిడి ఉత్పత్తి లభిస్తుందని అంచనా వేస్తోంది సదరు కంపెనీ. రాబోయే రోజుల్లో ఈ సామర్థ్యం ఏడాదికి 1,000 కిలోలకు చేరుతుందని ఓ అంచనా. ఈ గోల్డ్ మైన్ సుమారు 15 ఏళ్ల పాటు ఉత్పత్తిని కొనసాగించే అవకాశం తెలుస్తోంది.
ALSO READ: అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటున్నారా?.. నాణ్యతను ఇలా చెక్ చేసుకోండి
ఈ ప్రాజెక్టులో మైనింగ్ కార్యకలాపాలతోపాటు విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం, తాగునీరు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించింది. అలాగే పారిశ్రామికవృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ సహకారం లభించనుంది. దీనిపై జియో మైసోర్ డైరెక్టర్, డెక్కన్ గోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హనుమ ప్రసాద్ మాట్లాడారు.
ఈ ప్రాజెక్ట్ వాణిజ్యపరంగా కాకుండా వ్యూహాత్మకంగా దేశానికి అత్యంత అవసరమైన బంగారం, కీలక ఖనిజాల రంగంలోకి అనేక మంది పెట్టుబడిదారులను ప్రోత్సహించాలన్నారు. రాబోయే దశాబ్దంలో దేశంలో ఏడాదికి కనీసం 50 నుండి 100 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.