CPI Inflation: కొత్త CPI సిరీస్ డేటా ఆధారంగా జనవరిలో.. ఫుడ్, విలువైన లోహాల ధరలు పెరగడంతో వినియోగదారుల ధరల సూచిక (CPI) ద్రవ్యోల్బణం 2.75%కి పెరిగింది. సీపీఐ బేస్ సంవత్సరం 2012 నుంచి 2024కి మార్చారు. వినియోగదారుల బాస్కెట్ ను 299 నుంచి 358 వస్తువులకు పెంచారు. కొత్త సిరీస్ ద్రవ్యోల్బణం గృహ వినియోగ విధానాలను కచ్చితంగా ప్రతిబింబిస్తుందని నిపుణులు అంటున్నారు. మొదటిసారిగా గ్రామీణ ఇంటి అద్దెను సీపీఐలోకి చేర్చారు.
ఇవాళ విడుదల చేసిన గణాంకాల మేరకు.. ఆహార ద్రవ్యోల్బణం సంవత్సరానికి 2.13%కి పెరిగింది. తగ్గిన వెయిటింగ్ కారణంగా ప్రధాన ద్రవ్యోల్బణంపై దీని మొత్తం ప్రభావం గత సిరీస్ కంటే తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సంబంధిత ద్రవ్యోల్బణ రేట్లు వరుసగా 2.73% ,2.77%గా ఉన్నాయి. కొత్త సిరీస్ కింద కీలక విభాగాలకు చెందిన డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు.
సీపీఐ డేటా ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానాన్ని నిర్ణయిస్తుంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2% నుంచి 6% పరిధిలో ఉంచడం ఆర్బీఐ లక్ష్యం. డిసెంబర్ 2025 నుండి జనవరి 2026 వరకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల కనిపించింది.
“సీపీఐ ద్రవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగానే ఉంది. ప్రధాన ద్రవ్యోల్బణం మా అంచనాల కంటే చాలా తక్కువగా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం చాలా అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గింపు ఉండదని భావిస్తున్నాం. RBI మరికొంత కాలం పాటు వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించే అవకాశం ఉంది” అని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాసన భరద్వాజ్ అన్నారు.
Also Read: చమురు ధరలు తగ్గాయి ఇంకెక్కడి మాంద్యం.. సుంకాలపై వెనక్కుతగ్గని ట్రంప్
పదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం CPI డేటా బేస్ ఇయర్ను అప్డేట్ చేసింది. మెథడాలజీ అప్గ్రేడ్లలో భాగంగా 2.5 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న 12 నగరాల్లో అమెజాన్, స్విగ్గీతో సహా ఇ-కామర్స్, డిజిటల్ ప్లాట్ఫారమ్ల నుంచి ధరలను సేకరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. విమాన టికెట్లు, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ స్ట్రీమింగ్ సేవలకు సంబంధించిన ధరలు కూడా సీపీఐలో జోడిస్తున్నామన్నారు. 2012 బేస్ ఇయర్తో పాత సిరీస్ కింద రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి 2025లో 4.26%, డిసెంబర్లో 1.33%గా ఉంది.