India US Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధించిన సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యం భారత్-యూఎస్ మధ్య వాణిజ్య చర్చలు వాయిదా పడ్డాయి. ఇటీవల భారత్-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి తుదిరూపును ఖరారు చేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు ఫిబ్రవరి 23 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్ భేటీ కావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాణిజ్య చర్చలను రీషెడ్యూల్ చేసినట్లు అధికార ప్రతినిధులు తెలిపారు.
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అనంతర పరిణామాలను ఇరు దేశాలు అధ్యయనం చేస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు దిద్దడానికి భారత ప్రతినిధులు వాషింగ్టన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇరువైపులా చర్చించుకుని కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తిన్న ట్రంప్.. శనివారం సుంకాలను 10 శాతానికి తగ్గించారు. అయితే నిన్న రాత్రి ఈ సుంకాలను 15 శాతానికి పెంచారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందింస్తూ.. “సుప్రీంకోర్టు తీర్పు హాస్యాస్పదంగా ఉంది. ఇది అమెరికన్లకు వ్యతిరేక నిర్ణయం. ఈ తీర్పుపై సమగ్రమైన సమీక్ష అవసరం. ఇన్నాళ్లు చాలా దేశాలు తమ చెత్తను అమెరికాను ఎగుమతి చేశాయి. అందుకే ఈ దేశాలపై 15 శాతం సుంకాలను విధిస్తున్నాను” అని ట్రంప్ ప్రకటించారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అత్యవసర అధికారాలను ఉపయోగించి సుంకాలను విధించే కార్యనిర్వాహక అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చిచెప్పింది. దిగుమతులపై సుంకాలను విధించడం రాజ్యాంగ అధికారాన్ని అధిగమించడమేననే తీర్పు చెప్పింది.
Also Read: భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. లగ్జరీ కార్లపై తగ్గిన ట్యాక్స్.. ఆ కార్లకు మినహా!
అమెరికాలోకి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలకు విధిచేందుకు ట్రంప్ దూకుడుగా వ్యవహరించి 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టా్న్ని (IEEPA) వినియోగించారు. ఈ చట్టం ఉపయోగించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 6-3 తేడాతో తీర్పు ఇచ్చారు.