International flight fare hike: అంతర్జాతీయ ప్రయాణాలకు సిద్ధమవుతున్న పర్యాటకులకు విమానయాన సంస్థలు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణ టిక్కెట్ల ధరలను విమానయాన సంస్థలు మరోసారి పెంచాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, యూరప్, అమెరికా మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ భారం ఎక్కువగా పడనుంది. గత కొన్ని నెలలుగా విమాన ఇంధన (ATF) ధరల్లో హెచ్చుతగ్గులు, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువలో మార్పులు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు విమానయాన సంస్థలు అంతర్జాతీయ రూట్లలో ధరలు పెంచినప్పటికీ.. దేశీయ విమాన ప్రయాణికులకు మాత్రం పెద్ద ఊరట లభించింది. దేశీయ విమాన టిక్కెట్ల ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పులు లేవని సంస్థలు స్పష్టం చేశాయి. వేసవి సెలవుల సీజన్ కావడంతో దేశంలో పర్యాటక రంగం పుంజుకుంటున్న తరుణంలో.. దేశీయంగా ధరలు పెంచకపోవడం వల్ల ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దేశీయ విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు పన్నుల విషయంలో కొంత వెసులుబాటు కల్పించడమే దీనికి కారణమని తెలుస్తోంది.
అంతర్జాతీయ మార్గాల్లో పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. సాధారణంగా సెలవుల సమయంలో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు ధరలను సవరించినట్లు సమాచారం. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారు ఈ అదనపు భారాన్ని భరించాల్సి వస్తోంది. ప్రైవేట్ ఎయిర్లైన్స్ తమ లాభాలను పెంచుకునే క్రమంలో అంతర్జాతీయ నెట్వర్క్పై దృష్టి సారించాయి.
కాగా ఇటీవల భారత విమానయాన పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ (FIA) కేంద్రాన్ని హెచ్చరించింది. ఆకాశాన్నంటుతున్న విమాన ఇంధన (ATF) ధరలు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్జెట్ వంటి సంస్థల నిర్వహణపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆకస్మికంగా పెరిగిన ఖర్చుల నుంచి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో FIA విజ్ఞప్తి చేసింది. ఇంధన భారం తగ్గించకపోతే విమానయాన రంగం మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
Read Also: సీఎం బంగ్లా ఖాళీ చేసిన మమత.. ఓటమి భయంతోనే ఖాళీ చేశారా?.. బీజేపీ సెటైర్లు