Mamata Banerjee shifts to Bhawanipur: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సమయం దగ్గరపడుతున్న వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మే 4న కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. ఆమె తన అధికారిక నివాసాన్ని తాత్కాలికంగా ఖాళీ చేసి భవానీపూర్లోని ఒక అద్దె ఫ్లాట్కు మారుతున్నారు.
గత 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని దీదీ ఈసారి ఎక్కడా చిన్నపాటి పొరపాటుకు కూడా తావు ఇవ్వకూడదని భావిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు తాను భవానీపూర్లోనే ఉండి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం టీఎంసీ నేతలు భవానీపూర్ ప్రాంతంలో ఒక 3BHK ఫ్లాట్ కోసం అన్వేషణ ప్రారంభించారు. సీఎం నివాసానికి భవానీపూర్ సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. కౌంటింగ్ కేంద్రాలకు దగ్గరగా ఉండి ప్రత్యక్షంగా నిఘా ఉంచడం ఆమె ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయంపై భారతీయ జనతా పార్టీ (BJP) వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. “ఫలితాలకు ముందే బంగ్లా ఖాళీ చేస్తున్నారంటే.. ఓటమి భయం దీదీని వెంటాడుతోంది.” అంటూ బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే మమత మాత్రం తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాల్స్కు తరలించే సమయంలో యంత్రాలను మార్చే కుట్ర జరిగే అవకాశం ఉందని.. అందుకే తాను స్వయంగా కాపలా ఉండాలని నిశ్చయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తోసిపుచ్చుతూ.. టీఎంసీ ఒంటరిగానే 226 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేవలం తమ కార్యకర్తల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసేందుకే బీజేపీ మీడియా మేనేజ్మెంట్ చేస్తోందని విమర్శించారు. మీడియా నెరేటివ్లను నమ్మవద్దని.. ఫలితాల రోజున అసలు నిజం బయటపడుతుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటల పాటు నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు.
Read Also: ఎన్నికలు ముగిసినా బెంగాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఈసీపై టీఎంసీ తీవ్ర ఆరోపణలు