Mutual Funds Reforms: మ్యూచువల్ ఫండ్ సెక్టార్లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి-సెబీ. కొన్నాళ్లుగా ఫండ్ మేనేజర్లు రకరకాల పేర్లతో చేస్తున్నవాటిపై కొరడా ఝులిపించింది. ఇకపై కేవలం ఐదు కేటగిరీలు ఉండనున్నాయి. వాటి పేరుతో మాత్రమే ఫండ్స్ సేకరించనున్నారు ఫండ్స్ మేనేజర్లు. రద్దు చేసిన పాత మ్యూచువల్ ఫండ్స్ మాటేంటి? మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణకు నిబంధనలను కఠినం చేసింది. వారిని తప్పుదోవ పట్టించేలా రిటర్న్,క్లెయిమ్లతో ఫండ్ పథకాల పేర్లను రూపొందించడాన్ని నిలిపి వేసింది.
మ్యూచువల్ ఫండ్స్లో భారీ సంస్కరణలు
మ్యూచువల్ ఫండ్స్ సెక్టార్లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది సెబీ. వాటిని నిర్వహించే ఫండ్స్ మేనేజర్లు ఇష్టానుసారంగా రకరకాలుగా ఫండ్స్ పేరిట డబ్బులు సేకరించడం కుదరదు. ఇకపై సెబీ రూల్స్ కచ్చితంగా ఫాలో కావాల్సిందే. దీనికి గురువారం ఓ సర్క్యులర్ జారీ చేసింది సెబీ. ఇప్పటి వరకు రకరకాల పేర్లతో ఫండ్స్ పేరిట నిధులు సేకరించేవారు.
ఇకపై వాటికి అడ్డుకట్టే వేసింది. ఆయా మ్యూచువల్ ఫండ్స్ను ఐదు రకాలుగా వర్గీకరించింది. వాటిలో ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, లైఫ్ సైకిల్, ఇతర పథకాల పేరుతో ఏర్పాటు చేసింది. సొల్యూషన్ ఓరియంటెడ్ ఫథకాలను తొలగించింది. వాటి స్థానంలో కొత్తగా లైఫ్ సైకిల్ ఫండ్స్ పేరుతో ప్రత్యేక క్యాటగిరీల ఫండ్స్ ప్రవేశపెట్టింది. ఫండ్స్ కాలపరిమితి 5 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటాయి.
లైఫ్ సైకిల్ ఫండ్స్ విషయానికి వద్దాం. కాల పరిమితితో కూడిన ఓపెన్ ఎండెండ్ పథకాలు. ఇందులో వచ్చే పెట్టుబడులను ఈక్విటీ, డెట్, ఇన్విట్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ కమొడిటీ డెరివేటివ్స్-ETCD, బంగారం, వెండి-ETF విధంగా పలు విభాగాల్లో కేటాయింపులు చేయనున్నారు. లైఫ్ సైకిల్ ఫండ్స్ని కనిష్ఠంగా 5 ఏళ్లు కాగా, గరిష్ఠంగా 30 ఏళ్లు. కాల పరిమితి ముగిసే వరకు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం కుదరదు. అనుకోని పరిస్థితిల్లో ఏడాది నుంచి మూడేళ్లలోపు వెనక్కి తీసుకుంటే మూడు శాతం వరకు ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది.
ఫండ్ మేనేజర్లకు ఝలక్, ఇకపై ఐదు మాత్రమే
ఇందులో అధిక నష్టాలతోపాటు అధిక రాబడులకు అవకాశం ఉన్న ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెడతారు. క్రమంగా ఈక్విటీ పెట్టుబడులు తగ్గిస్తారు. నష్టాలు లేకుండా స్థిరమైన రాబడులు వచ్చేవాటిలో పెట్టుబడులు పెంచుతారు. ఇలాంటి నిర్ణయం వల్ల రిటైర్మెంట్, పిల్లల చదువులు, పెళ్లిళ్ల వంటి లక్ష్యాలు నెరవేరతాయని ఆలోచన చేసింది.
ఫండ్ పథకాల పేర్లు… దాని పేరు మాదిరిగానే ఇకపై ఉండనుంది. మదుపరలు సులువుగా ఫండ్ పథకాలను గుర్తించవచ్చు. ప్రతిఫలం లేదా రాబడిని ప్రస్తావించే పదాలు ఉండకూడదని పేర్కొంది. అంతేకాదు మదుపరులకు ఇచ్చే పత్రాలు, ప్రకటనలు పథకానికి సంబంధించిన వివరాలు సెబీ నిర్దేశించిన పద్ధతి ప్రకారం ఉండాలి. ఫండ్ ఆఫ్ ఫండ్-FOF పథకాలు, ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్స్-ETF లాంటి పాసివ్ పథకాలను ఇతర పథకాల కిందకు చేర్చింది.
ALSO READ: పాత బంగారంతో కొత్త ఆదాయం.. ఏం చేయాలంటే?
పదవీ విరమణ, పిల్లల చదువులు, పెళ్లి వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సొల్యూషన్ ఓరియెంటెడ్ పథకాలను తక్షణమే నిలిపి వేయనుంది. ఈ విభాగంలో కొత్త వారిని ఇకపై చేర్చుకోరు. ఇప్పుడు అందులో ఉన్నవారిని కంటిన్యూ చేస్తారు. ఈ పథకాల తరహాలో కేటాయింపులు, రిస్క్ ప్రొఫైల్ ఉండే వాటిల్లో విలీనం చేయనున్నారు. ఈ విషయంలో ముందస్తుగా సెబీ అనుమతి తీసుకోవాలి.
మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద బంగారం, వెండి విలువ లెక్కింపు విధానాన్ని సెబీ సవరించింది. వీటి విలువను లెక్కించేందుకు స్టాక్ ఎక్స్ఛేంజీలు వెల్లడించే స్పాట్ ధరలను ఉపయోగించవచ్చు. ఈ విధానం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ నిర్ణయించిన ధరల మేరకు బంగారం, వెండి ఈటీఎఫ్ల విలువ లెక్కగడుతున్న విషయం తెల్సిందే.