Union Budget 2026: 2026-27 కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1(ఆదివారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్ కోసం ఉద్యోగులు, పెట్టుబడిదారులు, సామాన్యులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని సంప్రదాయాలు పాటిస్తున్నారు. ఆర్థిక పద్దు తెచ్చే బ్రీఫ్కేసులు, బ్లూ షీట్స్, హల్వా వేడుక వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
బడ్జెట్ను గతంలో ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు లండన్లో బ్రిటీష్ అధికారుల పని దినాలకు అనుగుణంగా ప్రవేశపెట్టేవారు. దీనిని 1999లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా మార్పు చేశారు. భారత విధానాలకు అనుగుణంగా ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అప్పటి నుండి కొత్త సంప్రదాయం కొనసాగుతోంది. ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ ప్రకటించే సంప్రదాయాన్ని 2017లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మార్చారు. ఆయన ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈలోగా బడ్జెట్ను ఆమోదించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
70 సంవత్సరాలకు పైగా బ్రిటీష్ సంప్రదాయానికి అనుగుణంగా బడ్జెట్ పత్రాలను తీసుకెళ్లడానికి ఎరుపు రంగు బ్రీఫ్కేస్ను పార్లమెంట్ కు తీసుకొచ్చేవారు. కానీ 2019లో సీతారామన్ దేశవ్యాప్తంగా అకౌంటెంట్లు ఉపయోగించే సంప్రదాయ లెడ్జర్ అయిన ‘బహి-ఖాతా’లో బడ్జెట్ను తీసుకెళ్లడంతో బ్రీఫ్ కేస్ సంప్రదాయానికి బ్రేక్ పడింది. 2021లో COVID-19 మహమ్మారి కారణంగా బడ్జెట్ ను కాగిత రహితం చేశారు. అయితే డిజిటల్ టాబ్లెట్ను ‘బహి-ఖాతా’ లాంటి ఎరుపు కేసులో తీసుకెళ్లే సంప్రదాయం మాత్రం కొనసాగిస్తున్నారు.
2020లో 2 గంటల 42 నిమిషాల పాటు సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగం చేసి సీతారామన్ బడ్జెట్ రికార్డును సొంతం చేసుకున్నారు. అలసట కారణంగా ఆమె ఆ ప్రసంగాన్ని ఆపివేశారు.
1991లో 18,650 పదాలతో మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగం అత్యంత పొడవైన బడ్జెట్ ప్రసంగంగా రికార్డుల్లో ఉంది.
1977లో మొరార్జీ దేశాయ్ చేసిన ప్రసంగంలో అత్యంత చిన్న బడ్జెట్ ప్రసంగం. ఇందులో కేవలం 800 పదాలే ఉన్నాయి.
బడ్జెట్ సన్నాహాలకు చివరి దశలో ‘లాక్ ఇన్’ ప్రక్రియలో భాగంగా జనవరి 27న న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్లో హల్వా వేడుక నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను ఆర్థికశాఖ అధికారులకు పంపిణీ చేశారు. ‘హల్వా’ను సంప్రదాయంలో భాగంగా బడ్జెట్ను సమర్పించడానికి ముందు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఉన్న బడ్జెట్ ప్రెస్లో తయారు చేస్తారు. ఆర్థిక మంత్రి ఈ తీపి వంటకాన్ని అధికారులకు వడ్డిస్తారు. బడ్జెట్ ప్రిపరేషన్ తర్వాత ‘లాక్ ఇన్’ పీరియడ్ కు ఇది సంకేతంగా చెబుతారు. అంటే బడ్జెట్ ప్రిపరేషన్ పాల్గొన్న అధికారులను.. పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టే వరకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా లాక్ చేస్తారు.
బడ్జెట్ ‘బ్లూ షీట్’ నార్త్ బ్లాక్ సీక్రెట్స్ ఒకటి. సంప్రదాయకంగా నీలి రంగులో కోడ్ చేసిన ‘షీట్’, బడ్జెట్లోని అన్ని లెక్కలను బ్లూప్రింట్ లో ముద్రిస్తారు. ఇది బడ్జెట్ ను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆర్థిక మంత్రికి కూడా నార్త్ బ్లాక్ వెలుపల ‘బ్లూ షీట్’ను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. నీలి షీట్ను ఖరారు అంటే అధికారుల ‘లాక్ ఇన్’ పీరియడ్ ప్రారంభమైందని అర్థం.
Also Read: ఐకూ నుంచి రెడ్మీ వరకు.. రూ.30వేల బడ్జెట్లో పవర్ఫుల్ గేమింగ్ ఫోన్లు!