CM Chandrababu: కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజావేదిక సభలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, గత ప్రభుత్వ వైఫల్యాలపై చేసిన కీలక ప్రసంగం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రం ఇవ్వనంత భారీ స్థాయిలో పెన్షన్లను అందిస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నెలకు సుమారు రూ.2,730 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నామని.. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తో పోలిస్తే ఇది ఎంతో అధికమని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతమయ్యాయని.. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలున్నా ఆర్థిక సాయం అందిస్తున్నామని.. దీపం-2.0 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేపట్టినట్లు వివరించారు.
మహిళల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ మొదటి నుండి ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు గుర్తుచేశారు. ఎన్టీఆర్ హయాంలో ఆస్తిలో సమాన హక్కు కల్పించగా.. తాను విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశానని చెప్పారు. త్వరలోనే చట్టసభల్లోనూ 33 శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయని.. భవిష్యత్తులో మహిళలు పెద్ద సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను అందించి, వర్షం లేకపోయినా చెరువులను జలకళతో నింపామని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతపురాన్ని ఎడారి నుంచి నీటి సంరక్షణ కేంద్రంగా మార్చామని.. 10 లక్షల చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. రాయలసీమను దేశానికే హార్టికల్చర్ హబ్గా మారుస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 20 లక్షల ఎకరాల ఉద్యాన సాగును రెట్టింపు చేసి, 500 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించడమే లక్ష్యమని ప్రకటించారు.
గత ప్రభుత్వ హయాంలో భూములపై హక్కులను కాలరాసేలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వంటి నల్ల చట్టాలను తెచ్చారని చంద్రబాబు విమర్శించారు. సర్వే రాళ్లపై బొమ్మల కోసం రూ. 700 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసిందని, 22A సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ట్యాంపరింగ్ చేయడానికి వీలులేని ఆధునిక టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
Also Read: ప్రాణం తీసిన ఆహారం.. గొంతులో బోండా ఇరుక్కుని లారీ డ్రైవర్ మృతి