తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు ప్రత్యేక విచారణ బృందం (SIT) ఎదుట హాజరుకానున్నారు. గత కొన్ని రోజులుగా నోటీసులు, విచారణ వేదికపై నెలకొన్న సస్పెన్స్కు తెరదించుతూ.. బంజారాహిల్స్లోని తన నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లో ఉంటున్న కేసీఆర్ రేపు ఉదయమే అక్కడి నుండి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఆయన నందినగర్ నివాసానికి చేరుకుంటారు. ఇప్పటికే ఈ అంశంపై ఆయన తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, పార్టీ సీనియర్ నేతలతో పాటు ప్రముఖ న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించారు. చట్టపరమైన ప్రక్రియకు సహకరించడం ద్వారా రాజకీయంగా ఎదురుదాడి చేయవచ్చని భావించిన కేసీఆర్, విచారణకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తొలుత తనను ఎర్రవల్లి ఫాంహౌస్లోనే విచారించాలని కేసీఆర్ కోరగా, సిట్ అధికారులు అందుకు నిరాకరించారు. అయితే.. కేసీఆర్ వయస్సు, ఆయనకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను దృష్టిలో ఉంచుకుని, పోలీసులు లేదా సిట్ కార్యాలయానికి కాకుండా, హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే విచారణ జరిపేందుకు అధికారులు అంగీకరించారు. ఈ విచారణ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా ఉండాలని భావిస్తున్న సిట్, మొత్తం స్టేట్మెంట్ను వీడియో గ్రాఫీ చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైన తరుణంలో ఈ నోటీసులు రావడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.
మరోవైపు, విచారణకు సహకరించడం ద్వారా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని నిరూపించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. రేపు సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఇచ్చే సమాధానాలు ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.