Ranga Reddy: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి సమీపంలోన ప్లాస్టిక్ రీసైక్లింగ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. గోదాంలో భారీ ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలు, పాత సామాగ్రి నిల్వ ఉండటంతో మంటలు క్షణాల్లోనే పరిసరాలన్నింటికీ వ్యాపించాయి. ఈ ప్రమాదం కారణంగా వెలువడిన దట్టమైన నల్లటి పొగ ఆకాశమంత ఎత్తున అలుముకోవడంతో కిలోమీటరు దూరం వరకు ఆ ప్రాంతమంతా చీకటిగా మారిపోయింది.
అయితే పొగ తీవ్రత కారణంగా చుట్టుపక్కల నివసించే ప్రజలు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొదట రెండు ఫైర్ ఇంజిన్లతో ప్రయత్నించినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అదనపు వాహనాలను రప్పించారు.
దాదాపు నాలుగు నుంచి ఐదు ఫైర్ ఇంజిన్ల సహాయంతో సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదాం ఇరుకైన ప్రాంతంలో ఉండటం, లోపల మండే స్వభావం గల ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల మంటలను పూర్తిగా ఆర్పివేయడం సిబ్బందికి సవాలుగా మారింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ గోదాంకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
Also Read: కవిత త్యాగం.. అజారుద్దీన్ మంత్రి పదవికి తప్పిన గండం
అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
TG: రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ బుద్వేల్లోని ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ గోదాంలో మంటలు చెలరేగాయి. గోదాంలో ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి, ఆకాశమంత ఎత్తున దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన… pic.twitter.com/fT5R1VLiRy
— ChotaNews App (@ChotaNewsApp) January 13, 2026