Khammam: స్వేచ్ఛ బ్యూరో: ఈగల్ ఫోర్స్ అధికారులు ఖమ్మం పోలీసులతో కలిసి మరో ఆపరేషన్ ను సక్సెస్ చేశారు. పక్కాగా సేకరించిన సమాచారంతో ఒడిశా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న 90లక్షల విలువ చేసే 180 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గంజాయి ట్రాన్స్ పోర్టర్ ను అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు.
టొయోటా కారులో 180 కిలోల గంజాయి
ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లాకు చెందిన ప్రబిన్ బాత్రా కొంతకాలంగా గంజాయి ట్రాన్స్ పోర్టర్ గా పని చేస్తున్నాడు. బికారి అలియాస్ రోహన్ గంజాయి తీసుకుని హైదరాబాద్ వస్తే 10వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు. హైదరాబాద్ చేరుకోగానే తనను కాంటాక్ట్ చేయాలని తెలిపాడు. దీనికి అంగీకరించిన ప్రబిన్ బాత్రా మల్కాన్ గిరిలో 180 కిలోల గంజాయి కొని టొయోటా ఇటియోస్ కారులో లోడ్ చేసుకుని హైదరాబాద్ బయల్దేరాడు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఈగల్ ఫోర్స్ అధికారులు ఖమ్మం పోలీసులతో కలిసి రేజర్లలోని ప్రైమరీ అగ్రికల్చరల్ కో ఆపరేటీవ్ సొసైటీ వద్ద మాటు వేశారు.
పోలీసులు కేసు నమోదు
ప్రబిన్ బాత్రా కారుతో అటుగా రాగానే అడ్డుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కారులో తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు దొరికాయి. నిందితున్ని జరిపిన విచారణలో ఈ గంజాయిని కర్నూలు జిల్లా నంధ్యాలకు చెందిన నాగేశ్వర్ అనే వ్యక్తికి డెలివరీ ఇవ్వాల్సి ఉన్నట్టుగా వెల్లడైంది. ప్రబిన్ బాత్రాపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసిన ఈగల్ ఫోర్స్ అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం అతన్ని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
Also Read: ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి లైన్ క్లియర్.. బడ్జెట్, ప్రత్యేకతలు ఇవే!
పరారీలో ఉన్న రోహన్, నాగేశ్వర రావు కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలు, వాడకం గురించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే 1908 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. దాంతోపాటు 87126 71111 నెంబర్ కు వాట్సాప్ ద్వారా కూడా వివరాలు తెలియచేయవచ్చని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు.