Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలోని ఖరమ్ సేడ గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ఒక ఎద్దును రక్షించబోయి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మూగజీవాన్ని బతికించాలనే వారి తాపత్రయం, ఆ కుటుంబంలో ఎప్పటికీ తీరని ఘోర విషాదాన్ని మిగిల్చింది.
అసలేం జరిగిందంటే..?
శుక్రవారం రాత్రి సమయంలో గ్రామానికి చెందిన ఒక ఎద్దు ప్రమాదవశాత్తు 40 అడుగుల లోతున్న పాడుబడిన బావిలో పడిపోయింది. దానిని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాడు సహాయంతో బావిలోకి దిగారు. అయితే లోపలికి వెళ్లిన కాసేపటికే వారి నుంచి ఎటువంటి శబ్దంగానీ, స్పందనగానీ రాలేదు. దీంతో కంగారుపడిన మరో ఇద్దరు సభ్యులు వారిని కాపాడేందుకు వడివడిగా బావిలోకి దిగారు. దురదృష్టవశాత్తు కొన్ని నిమిషాలు గడిచినా వారు కూడా తిరిగి పైకి రాలేకపోయారు.
ఊపిరాడక ముగ్గురు మృతి
లోపల ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. తాళ్లు, కొక్కాల సహాయంతో దాదాపు మూడు గంటల పాటు శ్రమించి నలుగురిని బయటకు తీశారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులను రాహుల్ యాదవ్ (36), వీరేంద్ర యాదవ్ (40), కృష్ణదత్ యాదవ్ (26)గా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన నాలుగో వ్యక్తి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
Also Read: పవన్ కల్యాణ్ అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నారు: పేర్నినాని
ప్రాణాలు తీసిన విషవాయువు
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. చాలా కాలంగా ఆ బావిని ఉపయోగించకపోవడంతో అందులో భారీగా చెత్తాచెదారం పేరుకుపోయిందని, దానివల్ల ప్రమాదకరమైన విషవాయువులు (టాక్సిక్ గ్యాసెస్) వెలువడ్డాయని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. బావిలోకి దిగిన వెంటనే ఆ గ్యాస్ పీల్చడం వల్లే ఊపిరాడక వారు మరణించారని వెల్లడించారు. ఈ ఘటనతో ఖరమ్ సేడ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.