bhadrachalam : భద్రగిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభితంగా మారింది. భద్రాచలంలో వసంతపక్ష పుష్కరోత్సవాల్లో భాగంగా వసంతపక్ష తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శ్రీరామాయణ మహాక్రతువుకు సంప్రదాయబద్ధంగా అంకురార్పణ చేశారు. బుధవారం సీతారామచంద్ర లక్ష్మణ స్వామి మూలమూరుల సన్నిధిలో ఉత్సవానుజ్ఞ తీసుకుని. ఉత్సవమూర్తులను చిత్రకూట మండపంవద్దకు తీసుకొచ్చి నవకలశాలతో ఉత్సవాంగ స్నపనం చేశారు . అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విక్గ్వరణంతో పాటు శ్రీమద్రారామాయణ పారాయణదారులు, ఆచార్య బ్రహ్మ, రుత్వికులకు దీక్షా వస్త్ర స్వీకరణ, రక్షాబంధనాలను నిర్వహించారు.
యాగశాల వద్ద దేవస్థానం అధర్వ వేద పండితులు ఓంకార ధ్వజారోహణం చేశారు. తర్వాత సీతారామ చంద్రస్వామిని చిత్రకూట మండపంలోకి తీసుకొచ్చి షోడశోపాచారాలతో ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక సంక్షేప రామాయణ పారాయణం జరిపి హారతి సమర్పించి, తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. సాయంత్రం గోవిందరాజస్వామి ఆలయంలో సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను మృత్స గ్రహణం నిర్వహించారు.
మూడు భాగాలుగా మట్టిని సేకరించి రెండు యాగశాలలతో పాటు కల్యాణ అంకురార్పణకు మరో భాగాన్ని వినియోగించారు. రాత్రి యాగశాల వద్ద శ్రీరామాయణ మహాక్రతువుకు అంకురార్పణం చేసి ప్రసాద వినియోగం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాన్ని అందించి సత్కరించారు. కల్యాణ ఆహ్వాన పత్రికను అందించి 30న నిర్వహించే శ్రీరామ నవమి వేడుకలకు ఆహ్వానించారు. ఆలయ ఈవో ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. 31న పట్టాభిషేకం కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.