Amavasya 2025: ఏడాదిలో వచ్చే అన్ని అమావాస్యలలో.. మహాలయ అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున చేసే ప్రత్యేక పూజలు, దానాల వల్ల పితృ దోషాలు తొలగిపోయి, వంశాభివృద్ధి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాలయ అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో.. ఎలాంటి దానాలు ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం – అమావాస్య కలయిక విశేషం:
సాధారణంగా అమావాస్య రోజు మరణించిన పూర్వీకులకు తర్పణాలు, పిండప్రదానం, దానధర్మాలు చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అయితే.. తెలుగు పంచాంగం ప్రకారం, ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. భాద్రపద బహుళ అమావాస్య ఆదివారం కలిసి రావడం మరింత పుణ్యప్రదం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మహాలయం అంటే ఏమిటి?
ఏడాదిలో వచ్చే 12 అమావాస్యలూ పితృదేవతలను ఆరాధించడానికి శ్రేష్ఠమైనవే. కానీ, భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్యగా జరుపుకోవడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ రోజున పూర్వీకులకు సద్గతులు కలిగించడం కోసం కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలని శాస్త్రం చెబుతోంది. అందుకే మహాలయ అమావాస్యకు అంతటి విశిష్టత ఉంది.
మహాలయ అమావాస్య సమయం:
తెలుగు పంచాంగం ప్రకారం.. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్యగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. సాధారణంగా ఏ పూజైనా సూర్యోదయ సమయంలో చేస్తాం.. కానీ పితృదేవతల కోసం చేసే పూజలు మాత్రం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలోనే పూర్వీకులకు తర్పణాలు వదలాల్సి ఉంటుంది.
మూడు రుణాలు – పితృ రుణం తీర్చుకోవడం:
గరుడ పురాణం ప్రకారం.. మానవజన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ మూడు రుణాలు తీర్చుకోవాలని తెలుస్తోంది. అవి దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం.
దేవ రుణం: నిత్యం దేవతారాధన చేయడం ద్వారా దేవ రుణం తీర్చుకోవచ్చు.
ఋషి రుణం: జ్ఞానాన్ని, ధర్మాన్ని బోధించిన గురువులకు కృతజ్ఞతతో ఉండటం, వారి బోధనలను గౌరవించడం ద్వారా రుషి రుణం తీర్చుకోవచ్చు.
పితృ రుణం: ఈ రుణం తీర్చుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మరణించిన పూర్వీకులకు ప్రతి సంవత్సరం శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, ప్రతి అమావాస్యకు తర్పణాలు విడవడం, వారి పేరిట దానాలు చేయడం ద్వారా పితృ రుణం తీర్చుకోవచ్చు.
ముఖ్యంగా.. మహాలయ అమావాస్య రోజు చేసే శ్రాద్ధ, తర్పణాల వల్ల పితృదేవతలకు సద్గతులు లభించి.. కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.
పితృదేవతలను ఆరాధించే విధానం:
మహాలయ అమావాస్య పితృదేవతలను పూజించడానికి అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజున చేసే ఆరాధన, దానధర్మాలు పూర్వీకులకు శాంతిని, వంశానికి శ్రేయస్సును కలిగిస్తాయి.
మహాలయ అమావాస్య రోజున మంత్రాలను పఠిస్తూ నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది. అలాగే, పండితుల సమక్షంలో నువ్వులతో హోమం నిర్వహించడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి.
పూర్వీకుల పేరిట చేయాల్సిన దానాలు:
మహాలయ అమావాస్య రోజున చేసే దానాల వల్ల వంశాభివృద్ధి జరుగుతుందని, సంతాన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయడం చాలా పుణ్యం.
ఆర్థికంగా స్థోమత ఉన్నవారు సువర్ణ దానం (బంగారం), గోదానం, భూదానం కూడా చేయవచ్చు.
ముఖ్యంగా.. ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు ఎర్ర గుమ్మడికాయను దానం చేయడం వల్ల వంశంలో వృద్ధి కలుగుతుందని విశ్వాసం.
రాహు కేతు దోషాలకు పరిహారం:
జాతకంలో రాహు కేతు దోషాలతో బాధపడేవారు, మహాలయ అమావాస్య రోజున నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ఈ పూజలు ఆ దోషాల ప్రభావాన్ని తగ్గించి, జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి.