Big Stories

Pushya Masam : ఈ పుష్యమాసంలో చేయాల్సిన పనులు..!

Pushya Masam

Pushya Masam : పౌర్ణమి రోజు.. చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడనే దానిని బట్టి ఆ నెలలకు ఆ నక్షత్రంతో కూడిన పేరును మన పూర్వీకులు నిర్ణయించారు. ఏదైనా నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు… చిత్తా నక్షత్రంతో కలిసి ఉంటే దానిని చైత్రం, అనీ విశాఖా నక్షత్రంతో ఉంటే వైశాఖం అని.. ఇలా ఆయా పేర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ నెలలో వచ్చిన పౌర్ణమి నాడు చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కూడి ఉన్నందున దీనిని పుష్యమాసం అంటారు.

- Advertisement -

పుష్య అంటే పోషణ శక్తిని కలిగించేది అని అర్థం. ప్రస్తుతం పుష్యమాసం నడుస్తోంది. చలికాలంలో వచ్చే ఈ మాసం సాధారణంగా శూన్యమాసమై ఉంటుంది గనుక గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, వివాహాది శుభకార్యాలు ఉండవు. కానీ.. జపము, ధ్యానము, సాధన, దేవతారాధనలకు ఇది అత్యుత్తమ మాసం. వేదం అధ్యయనానికి శ్రావణం నుంచి పుష్య మాసం వరకు అత్యుత్తమ సమయంగా పెద్దలు భావిస్తారు. ఈ నెలలో రైతులకు పంట చేతికొస్తుంది. కనుక ఈ రోజుల్లో వచ్చే సంక్రాంతి పండుగ, ఆ తర్వాతి రోజుల్లోనూ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.

- Advertisement -

పుష్యమాసం తొలి 15 రోజులు.. విష్ణు ఆరాధన చేయటం మన సంప్రదాయం. అలాగే.. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారు ఈ మాసంలో సూర్యుడికి సంబంధించిన లోహమైన రాగితో చేసిన చెంబుతో ధాన్యం లేదా నెయ్యి దానంగా ఇవ్వాలి. ఈ మాసంలో సూర్యుడు ద్వాదశ ఆదిత్యుల రూపంలో ఉంటాడు గనుక ఈ నెలలో రోజూ ఏదైనా దేవతా స్తోత్రం లేదా ఆదిత్య హృదయం 12 సార్లు చదవగలిగితే.. విశేష పుణ్యం లభిస్తుంది. అలాగే.. ఈ పుష్యమాసంలో ఆదివారం రోజున నెయ్యి, ఉసిరిని తినరాదు.

పుష్య మాసానికి అధిపతి శని. కనుక ఈ నెలలో ఆయనను పూజించి, పుష్య అమావాస్య రోజున శనికి తైలాభిషేకం చేసినా, ఈ నెలలో వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేసినా శని దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ మాసంలో హోమంలో నువ్వులను అర్పించటం, నువ్వుల వంటకాలు తినటం, తెల్ల నువ్వులతో దేవతలకు, నల్ల నువ్వులతో పితృ దేవతలకు తర్పణం చేయాలని ధర్మసింధు గ్రంథం వివరిస్తున్నది.

ఈ మాసంలో ఉదయకాలంలో చేసే స్నానానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో సూర్యోదయం నుంచి తొలి రెండు గంటల సమయంలో సూర్యుడి నుంచి వెలువడే కిరణాల్లో గొప్ప శక్తి, తేజస్సు ఉంటాయి. కనుక ఆ సమయంలో చేసే సాధన విశేషమైన ఫలితాన్నిస్తుంది. అలాగే.. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని ఉపాసిస్తే.. విశేష సిద్ధి కలుగుతుంది.

ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి నదికి ఉన్న ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఆ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. తమిళులు పుష్యపూర్ణిమను పూసమ్ అంటారు. ఆ రోజున తైపూసమ్ పేరుతో తంజావూరులో గొప్ప ఉత్సవం జరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News