BigTV English

Jabali Theertham : హనుమ అవతరించిన క్షేత్రమే .. జాబాలి తీర్థం

Jabali Theertham : హనుమ అవతరించిన క్షేత్రమే .. జాబాలి తీర్థం
Jabali Theertham

Jabali Theertham : తెలుగువారి ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరుడు నెలవైన తిరుమల క్షేత్రాన్ని మీరందరూ దర్శించే ఉంటారు. కానీ.. ఆ సప్తగిరులలోనే రామభక్తుడైన హనుమ అవతరించిన పుణ్యక్షేత్రమూ కొలువై ఉందనే సంగతి మనలో చాలామందికి తెలియదు. పరమరామ భక్తి పరుడు, రుద్రాంశ సంభూతుడు, దాస భక్తికి పరాకాష్ట అయిన హనుమ.. అంజనీసుతుడిగా తిరుమల గిరుల్లోని జాబాలి తీర్థంలోనే మనల్ని తరింపజేసేందుకు కొలువుదీరాడు. ఎందరో యోగులు సిద్ధిపొందిన పరమ పవిత్ర ప్రదేశం ఇది.


స్థల పురాణం
తిరుమలలోని పాపనాశానికి వెళ్లేదారిలోని జాబాలి తీర్థం.. స్వామివారి ప్రధాన ఆలయానికి 5 కి.మీ దూరంలో ఉంటుంది. జాబాలి తీర్థానికి సంబంధించిన ప్రస్తావన వేంకటాచల మహత్యంలోనేగాక స్కందపురాణంలోనూ ఉంది.

దేవతల కోరిక మేరకు శ్రీ మహా విష్ణువు.. రామావతారాన్ని ధరించేందుకు సిద్ధమవుతున్నవేళ.. జాబాలి మహర్షి ముందుగానే.. హనుమంతుని అవతారాన్ని దర్శించాలని భావిస్తాడు. దీనికోసం అనేక ప్రదేశాలను దర్శిస్తూ.. నేటి జాబాలి తీర్థంలో కఠోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు.. ప్రత్యక్షమై రాబోయేకాలంలో తాను హనుమంతునిగా ఇదే స్థలంలో అవతరిస్తానని వరమిస్తాడు. నాడు జాబాలి మహర్షి తపస్సు ఆచరించిన ఆ ప్రదేశమే.. నేడు జాబాలి తీర్థం అనే పేరుతో పిలవబడుతోంది.


రామాయణంలోని అయోధ్య కాండలో జాబాలి మహర్షి.. శ్రీరాముడిని పరీక్షించే క్రమంలో పరుష పదజాలాన్ని వాడతాడు. అనంతరం దానికి పశ్చాత్తాప పడి, ఆ దోషాన్ని పోగొట్టుకునేందుకు జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరించి, ఆ పాపం నుంచి బయటపడ్డాడనే పురాణగాథలూ ఉన్నాయి.

దట్టమైన వృక్షాలతో, పక్షుల కిలకిలరావాలతో, పలు జలపాతాల సమీపంలోని ఈ కమనీయ క్షేత్రంలో ఆంజనేయుడు.. ఒక పెద్ద రావిచెట్టు మొదలులో కొలువుదీరి కనిపిస్తాడు. ఒళ్లంతా సింధూరాన్ని ధరించి, గదను ధరించి, వెండికవచంతో తనను దర్శించవచ్చిన భక్తుల భయాలను దూరంచేసే అభయ ప్రదాతగా కొలువై దర్శనమిస్తాడు. స్వామి వారి తలపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటాయి.

ఆంజనేయుడిని దర్శించుకున్న భక్తులు.. ఆలయం బయటగల పెద్ద వృక్షం మొదలులో ఉన్న గణపతిని దర్శించుకుని, ఆ మహావృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దీనివల్ల వారి కోరికలు త్వరగా నెరవేరతాయట. ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం చేస్తే.. సకల పాపాలు, భూతపిశాచ బాధలు తక్షణం తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

అలాగే.. ఆలయ సమీపంలోని రామకుండంలో 7 మంగళవారాల పాటు స్నానమాచరించి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల తమ కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం. అలాగే దీనికి సమీపంలోని సీతాకుండంలోనూ స్నానమాచరిస్తుంటారు. తిరుమల గిరుల నుంచి అనేక ఔషధీయ వృక్షాలను తాకుతూ వచ్చే ఈ కుండాల్లోని జలాలకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉంది.

జాబాలి తీర్థానికి సమీపంలోనే వేణుగోపాల స్వామి వారి ఆలయం, హథీరామ్‌ బాబా సమాధి కూడా ఉంటాయి.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×