Puri Jagannath temple mysteries: మనదేశంలో ఎన్నో పురాతన, ఆధ్యాత్మిక ఆలయాలు ఉన్నాయి. కానీ వాటిలో ఒరిస్సాలోని పూరీ జగన్నాథ ఆలయం అత్యంత ప్రత్యేకమైంది. ఎందుకంటే.. ఇక్కడ జరిగే కొన్ని వింతలు, విశేషాలకు నేటి సైన్స్ సైతం సమాధానం చెప్పలేక చేతులెత్తేసింది. ఎన్నో వందల ఏళ్లుగా శాస్త్రవేత్తలను, పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్న అంతుచిక్కని రహస్యాలు ఈ ఆలయంలో ఎన్నో ఉన్నాయి. భక్తుల నమ్మకానికి, దైవ శక్తికి నిదర్శనంగా నిలిచే 5 అద్భుతమైన రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గాలికి ఎదురుగా ఎగిరే వింత జెండా:
సాధారణంగా సైన్స్ నియమాల ప్రకారం.. ఏ జెండా అయినా గాలి ఏ వైపు వీస్తుందో, ఆ వైపుకే ఎగురుతుంది. కానీ పూరీ జగన్నాథ ఆలయం పైన ఉండే జెండా మాత్రం గాలి వీచే దిశకు పూర్తిగా వ్యతిరేక దిశలో ఎగురుతుంది.దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. అంతేకాదు.. ప్రతిరోజూ ఒక పూజారి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా, దాదాపు 45 అంతస్తుల భవనమంత ఎత్తు ఉన్న ఆలయ శిఖరం పైకి ఎక్కి ఈ జెండాను మారుస్తారు. ఒకవేళ ఏ ఒక్కరోజు ఈ జెండా మార్చకపోయినా.. ఆలయాన్ని వచ్చే 18 ఏళ్ల పాటు మూసివేయాల్సి వస్తుందని నమ్మకం.
2. ఎంతటి ఎండలోనైనా పడని గోపురం నీడ :
వాస్తు శిల్పకళలో పూరీ ఆలయం ఒక అద్భుతం. సాధారణంగా వెలుతురు ఉన్నప్పుడు ఏ వస్తువుకైనా నీడ పడటం ప్రకృతి సహజ నియమం. కానీ..పూరీ జగన్నాథ ఆలయ ప్రధాన గోపురం నీడ మాత్రం భూమిపై ఎక్కడా.. ఎప్పుడూ పడదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు ఏ దిశలో ఉన్నా సరే.. ఈ గుడి నీడ మాత్రం కనిపించదు. ఇది శిల్పుల నైపుణ్యమా లేక దైవ శక్తి వల్లే అలా జరుగుతుందా అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది.
3. గుడి పైనుంచి ఎగరని పక్షులు, విమానాలు :
దేశంలోని ఏ గుడి గోపురాన్ని చూసినా దానిపైన పక్షులు వాలడం, గుంపులు గుంపులుగా ఎగరడం చాలా కామన్గా చూస్తుంటాం. కానీ పూరీ జగన్నాథ ఆలయ గోపురం పైన కానీ, ఆలయ ప్రాంగణం పైనుంచి కానీ ఒక్క పక్షి కూడా ఎగరదు, వాలదు. చివరికి ఈ ఆలయం పైనుంచి ఎలాంటి విమానాలు లేదా హెలికాప్టర్లు కూడా వెళ్లవు. అందుకే దీనిని ప్రకృతి సిద్ధమైన ‘నో-ఫ్లై జోన్’ అని పిలుస్తారు. పక్షులు ఈ గుడి వైపు రాకపోవడానికి గల కారణాన్ని సైన్స్ కూడా ఇప్పటివరకు కనిపెట్టలేకపోయింది.
4. సింహద్వారం దాటగానే మాయమయ్యే సముద్రపు శబ్దం:
పూరీ జగన్నాథ ఆలయం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆలయం బయట ఉన్నంతసేపు సముద్రపు అలల శబ్దం చాలా గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. కానీ.. మీరు ఆలయ ప్రధాన ద్వారమైన ‘సింహద్వారం’ లోపలికి ఒక్క అడుగు పెట్టగానే.. ఆ సముద్రపు శబ్దం మాయమైపోయి ప్రశాంతంగా మారుతుంది. మళ్లీ గుడిలోంచి బయటకు అడుగు పెట్టగానే ఆ శబ్దం వినిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈ మార్పును చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ గాలి కూడా పగటిపూట సముద్రం నుంచి భూమికి, రాత్రిపూట భూమి నుంచి సముద్రానికి వీస్తుంది.. ఇది ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకు పూర్తిగా వ్యతిరేకం.
Also Read: అక్కడ పై కుండలోని అన్నం ముందెందుకు ఉడుకుతుంది? పూరీ జగన్నాథుడి వంటగది మిస్టరీ!
5. వంటగదిలోని కుండల అద్భుతం :
ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది పూరీ ఆలయంలోనే ఉంది. ఇక్కడ ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు మహాప్రసాదం వండుతారు. ఈ ప్రసాదాన్ని వండటానికి ఒకదానిపై ఒకటిగా మొత్తం 7 మట్టి కుండలను పెడతారు. కింద మాత్రమే మంట పెడతారు. కానీ ఇక్కడి వింత ఏంటంటే.. అన్నింటికంటే పైన, అంటే మంటకు అత్యంత దూరంగా ఉన్న ఏడవ కుండలోని అన్నం మొదట ఉడుకుతుంది. ఆ తర్వాత క్రమంగా కింద ఉన్న కుండలలోని అన్నం ఉడుకుతుంది. అలాగే.. గుడికి ఎంతమంది భక్తులు వచ్చినా ప్రసాదం అస్సలు తరిగిపోదు, అలాగని ఒక్క మెతుకు కూడా వృథా కాదు.
పూరీ జగన్నాథ ఆలయంలోని ఈ 5 రహస్యాలు కేవలం కథలు కావు, అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా చూసే నిజాలు.ఎంత టెక్నాలజీ పెరిగినా,నేటికీ ఈ ప్రశ్నలకు సైన్స్ దగ్గర పక్కా సమాధానం లేదు. అందుకే ఈ క్షేత్రం భక్తుల పాలిట ఓ గొప్ప ఆధ్యాత్మిక అద్భుతం.