
Nishkalank Mahadev Temple : మన దేశంలో బడి లేని ఊళ్లు ఉంటాయేమో గానీ.. గుడిలేని గ్రామాలు మాత్రం ఎక్కడా కనిపించవు. సాధారణంగా ఆలయాలు ఊరి మధ్యలోనో, కొండలు, గుట్టల మీదో, ఊరి పొలిమేరల్లోనో కనిపిస్తాయి. కానీ.. దీనికి భిన్నంగా మన దేశంలో ఒక ఆలయం సముద్ర గర్భంలో ఉంది. సముద్ర గర్భంలో ఉంటూనే రోజూ భక్తులచే ప్రత్యక్షంగా పూజలందుకుంటున్న ఈ ఏకైక ఆలయం గుజరాత్లో ఉంది.
గుజరాత్లోని భావ్నగర్కు దగ్గరలో కొలియక్ అనే గ్రామంలో సముద్ర తీరం నుండి కిలోమీటరున్నర దూరాన సముద్రగర్భంలోని ఒక చిన్న గుట్టపై ఈ శివాలయం ఉంది. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ శివాలయాన్ని దర్శించవచ్చు. మిగతా సమయంలో గుడి సముద్రంలో మునిగిపోయి ఉంటుంది.
ఈ దేవాలయాన్ని నిష్కళంక్ శివాలయం అని పిలుస్తారు. అని పిలుస్తారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో నిర్దిష్ట సమయం కాగానే.. అలలు వాటంతట అవే తగ్గి, ఆలయ శిఖరం, ఆలయం, గుట్ట దర్శనమిస్తాయి. ఆ సమయంలోనే భక్తులు అక్కడికి వెళ్లి స్వామిని సేవించుకుని తిరిగి వచ్చేస్తారు. భావ్నగర్కు సుమారు ముప్పై కిలో మీటర్ల దూరంలో కొలియాక్ గ్రామంలో ఉందీ ఆలయం.
ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారట. కురుక్షేత్ర సంగ్రామం కారణంగా జరిగిన ప్రాణ నష్టం ధాటికి తల్లడిల్లిన పాండవులు.. తమ పాప ప్రక్షాళనకు ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణ కథనం. అందుకే దీనికి నిష్కళంక్ శివాలయం అనే పేరు వచ్చింది.
ఉదయం సమయం సాధారణ సముద్రంగా కనిపించి, సరిగ్గా 11 గంటలు కాగానే.. సముద్రం నిదానంగా వెనక్కి వస్తుంది. అప్పుడు మనకు ఆలయం స్పష్టంగా కనిపిస్తుంది. భక్తులు ఈ సమయంలో ఆలయంలో పూజలు చేస్తారు. మధ్యాహ్నం కాగానే.. మళ్లీ సముద్రం ఆలయాన్ని క్రమంగా ముంచుతూ.. అర్థరాత్రి అయ్యే సరికి 20 మీటర్ల ఎత్తైన ఆలయపు ధ్వజస్తంభంతో సహా మొత్తం మునిగిపోతాయి. కానీ.. ధ్వజస్తంభం మీద ఎగిరే జెండా మాత్రం ఆలయపు గుర్తుగా అక్కడ కనిపిస్తుంది.వందల ఏళ్ళుగా భక్తులచే పూజలందుకుంటున్నఈ శివాలయానికి అమావాస్య, పౌర్ణమి రోజున వందల మంది భక్తులు వచ్చి స్వామిని సేవించుకుంటారు.