Karthika Masam 2025: కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన నెల. ఈ మాసంలో శివకేశవుల ఆరాధన, నదీ స్నానాలు, దీపారాధన, దానాలు వంటి వాటికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఉసిరి (ఆమ్లా) దీపం వెలిగించడం ఈ మాసంలో శుభప్రదంగా భావిస్తారు. ఉసిరి చెట్టు సాక్షాత్తు శివ స్వరూపంగా, ఉసిరికాయ లక్ష్మీదేవికి ప్రతిరూపంగా నమ్ముతారు. అందుకే కార్తీక మాసంలో.. ముఖ్యంగా సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉసిరి దీపారాధన చేయడం వల్ల అఖండ ఐశ్వర్యం, ఆరోగ్యం, నవగ్రహ దోష పరిహారం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
దీపారాధన వల్ల కష్టాలు తొలగిపోయి, సకల శుభాలు చేకూరుతాయని, మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే.. ఈ పవిత్రమైన ఆచారాన్ని పాటించేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. తెలియక చేసే చిన్న పొరపాట్లు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు.
ఉసిరి దీపం వెలిగించేటప్పుడు చేయకూడని ముఖ్యమైన పొరపాట్లు:
దెబ్బతిన్న ఉసిరికాయలు వాడటం: ఉసిరి దీపం వెలిగించడానికి ఎప్పుడూ తాజా, పురుగులు పట్టని, పగుళ్లు లేని మంచి ఉసిరికాయలను మాత్రమే వాడాలి. పగిలిన లేదా పాడైన కాయలను వాడటం మంచిది కాదు.
ఉసిరికాయను కత్తిరించడం: కొందరు వత్తిని నిలబెట్టడం కోసం ఉసిరికాయ పైభాగాన్ని గుండ్రంగా కత్తిరిస్తారు. ఇలా ఉసిరికాయను కోయడం అపచారం. ఉసిరికాయను కట్ చేయకుండానే.. దానిపై పిండి దీపం (పిండితో చేసిన చిన్న ప్రమిద) ఉంచి.. అందులో వత్తిని పెట్టి దీపారాధన చేయాలి. ఇది ఉత్తమమైన పద్ధతిగా పండితులు సూచిస్తారు.
దీపాన్ని మధ్యలో కదపడం లేదా ఆర్పడం: దీపం వెలిగించిన తర్వాత.. అది పూర్తిగా ఆరిపోయే వరకు దాన్ని కదపకూడదు. వేరే చోట పెట్టకూడదు. అలాగే.. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆర్పే ప్రయత్నం చేయకూడదు. దీపం సహజంగా ఆరిపోయే వరకు ఉంచాలి.
దీపదానం నియమాలు పాటించకపోవడం:
కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని లేదా ఉసిరికాయలను దానం ఇచ్చేవారు.. పాడైన లేదా రంధ్రాలు ఉన్న ఉసిరికాయలను దానంగా ఇవ్వకూడదు. అలాగే.. నాణ్యత లేని వస్తువులను నామమాత్రంగా కాకుండా.. మనం ఇంట్లో వాడుకునే విధంగా మంచి వస్తువులను దానం చేయాలి. దానం ఇచ్చేటప్పుడు మంచి మనసుతో.. శ్రద్ధగా ఇవ్వాలి.
దీపం ఆరిన తర్వాత:
దీపారాధన పూర్తయ్యాక ఉపయోగించిన ఉసిరికాయను నేరుగా చెత్తబుట్టలో పారవేయకూడదు. దానిని పవిత్రంగా భావించి.. ప్రవహించే నీటిలో (నది/కాలువ) వదలడం లేదా శుభ్రమైన మొక్కల మొదళ్ళలో వేయడం శ్రేయస్కరం.
ఉసిరి దీపం వెలిగించే విధానం:
ముందుగా పరిశుభ్రంగా స్నానం చేసి.. దీపం పెట్టే ప్రదేశాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమలతో ముగ్గు వేయాలి.
ఒక తమలపాకు లేదా శుభ్రమైన రాగి/స్టీలు పాత్రలో బియ్యం (తరువాత దానం ఇవ్వడానికి) ఉంచి.. దానిపై ఉసిరికాయను పెట్టాలి.
Also Read: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?
ఉసిరికాయ పైభాగంలో పిండితో చేసిన చిన్న ప్రమిదను ఉంచి.. అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి, తామరకాడ వత్తితో కానీ.. లేదా సాధారణ వత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి.
దీపం వెలిగించేటప్పుడు “ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి.
దీపాన్ని శివాలయం, విష్ణు ఆలయం ప్రాంగణంలో లేదా ఇంట్లో ఉసిరి చెట్టు కింద వెలిగించడం అత్యంత శుభప్రదం.
కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని భక్తిశ్రద్ధలతో.. నియమాలను పాటిస్తూ వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం, సమస్త దోష పరిహారం, కోరిన కోరికలు నెరవేరడం వంటి ఫలితాలు కలుగుతాయి.