![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/12/740c6faec4dc6f885b63c458995f6332.jpg)
Chudamani Temple : సాధారణంగా భక్తులు గుడికి వెళ్తే.. దేవుడికి కానుకలు సమర్పించి, కోరిన కోర్కెలు నేరెవేర్చమని మొక్కుతారు. కానీ.. ఈ గుడికి వెళ్లే భక్తులు మాత్రం.. గుట్టు చప్పుడు కాకుండా ఆలయంలోనే దొంగతనం చేయాలని చూస్తారు. అందుకు ఆలయంలో ఉండే పూజారులే సహకరిస్తారట. మరి ఈ ఆలయం కథేంటో చూద్దామా!
బొమ్మను దొంగిలిస్తే సంతానం..
ఉత్తరాఖండ్లో ‘చూడామణి దేవి ఆలయం’ ఉంది. ఈ ఆలయంలో సంతానం లేనివారు దొంగతనం చేస్తే.. పిల్లలు పుడతారని నమ్మకం. దొంగతనం అంటే.. డబ్బు, బంగారం కాదు. అమ్మవారి దగ్గర ఉండే చెక్క బొమ్మలను దొంగలిస్తారు. దానిని ఇంటికి తీసుకెళ్లి బిడ్డ పుట్టిన తర్వాత దొంగలించిన బొమ్మతో పాటు మరో బొమ్మని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ దొంగతనానికి అక్కడి పూజారులు కూడా సహకరిస్తారట.
అలా ప్రారంభమైంది..
1805లో ఓ రాజు అడవిలో సంచరిస్తుండగా చూడామణి ఆలయాన్ని చూసి తమకు పిల్లలను ప్రసాదించాలని వేడుకున్నాడు. అప్పుడు అమ్మవారు చెక్క బొమ్మ రూపంలో దర్శనమిచ్చింది. ఎవరికీ తెలియకుండా చెక్క బొమ్మను ఇంటికి తీసుకువెళ్లిన రాజుకు పండంటి బిడ్డ పుట్టాడు. దీంతో రాజు చెక్కబొమ్మతో పాటు మరో చెక్కబొమ్మనూ అమ్మవారికి సమర్పించాడట. అలా గుడిలో బొమ్మని దొంగిలించే ఆచారం ప్రారంభమైందట.