Minab City School Attack: పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీశాయి. గగనతల దాడులు.. క్షిపణి ప్రయోగాలతో ఇరు దేశాలు పరస్పరం విరుచుకుపడుతున్నాయి. ఈ ఘర్షణ కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా, జనావాసాలు, విద్యాసంస్థలపైకి మళ్లడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ సమాజం శాంతి కోసం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో అమాయక ప్రజలు.. చిన్న పిల్లలు బలైపోతున్నారు.
దక్షిణ ఇరాన్లోని మినాబ్ సిటీలో శనివారం అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఎలిమెంటరీ గర్ల్స్ స్కూల్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. పాఠశాల పనివేళల్లోనే ఈ దాడి జరగడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. శక్తివంతమైన బాంబు పేలుళ్ల ధాటికి పాఠశాల భవనం క్షణాల్లో కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో పాఠశాల లోపల ఉన్న 85 మంది చిన్నారి విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంక్రీట్ దిమ్మెల కింద నుండి చిన్నారుల మృతదేహాలను వెలికితీస్తుంటే అక్కడ ఉన్న వారి కళ్లు చెమర్చుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మరికొందరు విద్యార్థినులను సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.