Marijuana Attack: రోజు రోజుకి గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గంజాయి మత్తులో కొందరు యువకులు రెచ్చిపోయి, ఒక యువకుడిపై విచక్షణ రహితంగా దాడిచేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.
సిరిసిల్ల పట్టణంలోని బి.వై.నగర్ చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. స్థానిక గోపాల్ నగర్ ప్రాంతానికి చెందిన ఆకునూరి కళ్యాణ్ అనే యువకుడికి, మహర్షి అనే మరో యువకుడికి మధ్య చిన్నపాటి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మహర్షి తన స్నేహితులకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి పిలిపించుకున్నాడు.
గంజాయి మత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యువకులు, కళ్యాణ్ను చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితులు కేవలం చేతులతోనే కాకుండా.. అక్కడే ఉన్న రాళ్లతో, గాజు పెంకలతో కళ్యాణ్ను చితకబాదారు. ఈ క్రమంలో అతనిపై ఒక పెద్ద రాయిని వేయడంతో కళ్యాణ్ కాలు ఫ్రాక్చర్ అయి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఈ భీకర దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రి నుంచి ఫోన్ రావడంతో బాధితుడి తల్లి అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడిపై గంజాయి మత్తులో అన్యాయంగా దాడి చేశారని.. దీనివల్ల అతను తీవ్ర అంగవైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన మహర్షి , అతని మిత్రులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, తన కుమారుడికి న్యాయం చేయాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: నియోపోలిస్ నెక్స్ట్ లెవల్ ప్లాన్.. 30 ఏళ్ల వరకు నీటి కష్టాలకు చెక్!