Trump Claims: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు రెట్టింపు అవుతున్న వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్లో చమురు నిల్వలు, ఆ దేశ వాణిజ్యానికి కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో?
ఇరాన్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ చుట్టూ అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు భారీగా మోహరించిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యప్రాచ్యానికి వేలాది మంది అమెరికా సైనికులు తరలి వస్తున్న తరుణంలో తాను ఇరాన్లో చమురు స్వాధీనం చేసుకోవడానికి ఇష్టపడతానని వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు. ఆ దేశ ఆర్థిక గుండెకాయకు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చని సూచించారు.
ఈ సంఘర్షణలో ఖార్గ్ ద్వీపం ఒక వ్యూహాత్మక ఎంపికగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే ఇరాన్లోని చమురును తీసుకోవడం తనకు ఇష్టమైన విషయమేనన్నారు.
ఖర్గ్ ద్వీపంతోపాటు ఇరాన్ చమురు క్షేత్రాలు స్వాధీనం చేసుకుంటాం
అమెరికాలోని కొంతమంది మీరెందుకు అలా చేస్తున్నారని అంటున్నారని, వాళ్ళు మూర్ఖులుగా వర్ణించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తీవ్రమైతే ప్రపంచ ఇంధన మార్కెట్లను మరింత అస్థిర పరుస్తుంద్నారు. మధ్యప్రాచ్య సంక్షోభం తీవ్రం కావడంతో నెలలో 50 శాతానికి పైగా క్రూడ్ ధర పెరిగింది.
సోమవారం ఆసియా ట్రేడింగ్లో బ్యారెల్కు 116 డాలర్లకు పైకి ఎగబాకుతోంది. పెంటగాన్ వద్ద పలు సైనిక ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నాయని, బహుశా ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, చేసుకోక పోవచ్చన్నారు. ఈ లెక్కన కొంతకాలం అక్కడ ఉండాల్సి వస్తుందన్నారు. ఆ ద్వీపంలో ఇరాన్కు ఎలాంటి రక్షణ ఉందని తాను అనుకోవడం లేదని, దానిని చాలా సులభంగా స్వాధీనం అవుతుందన్నారు.
గతంలో వెనిజులాలో నికోలస్ మదురోను పట్టుకున్న తర్వాత అక్కడి చమురు పరిశ్రమను నియంత్రించిన మాదిరిగానే ఇరాన్లో అలాంటి పరిస్థితులు రావచ్చని సూచనప్రాయంగా చెప్పారు. ఇరాన్లోని 13,000 లక్ష్యాలపై బాంబు దాడులు చేశామన్నారు ట్రంప్. మరో 3,000 లక్ష్యాలు మిగిలి ఉన్నాయన్నారు. ఏప్రిల్ 6వ లోపు తమ షరతులకు అంగీకరించకపోతే ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని చెప్పకనే చెప్పారు.
ALSO READ: ప్రపంచానికి ఆ 8 మార్గాలు చాలా కీలకం.. చమురు రవాణాలో అవే కీలకం, ఒక్కరోజు ఆగినా
అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. ఇరాన్ని స్వాధీనం చేసుకోవడం 10 వేల మంది సైనికులను మోహరించాలని పెంటగాన్ ఇప్పటికే ఆదేశించినట్టు రాసుకొచ్చాయి. ప్రస్తుతం 3,500 మంది సిబ్బంది శుక్రవారం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మరో 2,200 మంది మెరైన్లు వెళ్తున్నారు.
82వ ఎయిర్ బోర్న్ డివిజన్కు చెందిన వేలాది మందిని మోహరించాలని భావిస్తోంది. ఖార్గ్ ద్వీపంపై ఏ దాడి చేసినా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి దూకుడు చర్య వల్ల అమెరికా సైనికులకు నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఘర్షణ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని, చమురు మార్గాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు.