Bangladesh Election 2026 result: ఎట్టకేలకు బంగ్లాదేశ్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ-బీఎన్పీ విజయం సాధించింది. తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలోని ఆ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రధానిగా తారిఖ్ రహ్మాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా రహ్మాన్కు శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు.. బీఎన్పీ ఘన విజయం
బంగ్లాదేశ్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించింది. రెండు దశాబ్దాల తర్వాత ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 299 స్థానాలకు గాను ఆ పార్టీ 210 సీట్లలో విజయం సాధించింది. జమాత్ -ఏ-ఇస్లామీ పార్టీ కేవలం 70 సీట్లకు పరిమితమైంది. దీంతో బీఎన్పీ అగ్రనేత తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
అవినీతి కేసుల నేపథ్యంలో దాదాపు 17 ఏళ్ల కిందట దేశం నుంచి వెళ్లిపోయారు రెహ్మాన్. ఇటీవల ఎన్నికల ముందు బంగ్లాదేశ్కు తిరిగొచ్చారు ఆయన. తల్లి జియా ఖాలిదా మరణంతో పార్టీ పగ్గాలను అందుకున్నారు. తాజా ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించారు.
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఎన్పీ అధినేత తారిఖ్ రహ్మాన్కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బంగ్లా ప్రజల విశ్వాసానికి మీ గెలుపు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య-ప్రగతిశీల సమ్మిళిత బంగ్లాదేశ్కు భారత్ మద్దతుగా ఉంటుందన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం, ఉమ్మడి లక్ష్యాలపై ముందుకు వెళ్లేందుకు పని చేసేందుకు ఎదురుచూస్తున్నామని రాసుకొచ్చారు.
బీఎన్పీ అధినేత రెహ్మాన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ఆ దేశంలోని 300 నియోజకవర్గాలకు గాను 299 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఓ అభ్యర్థి మరణంతో షేర్పూర్-3లో పోలింగ్ వాయిదా పడింది. బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ ప్రకారం.. 60.69 శాతం పోలింగ్ నమోదైంది. 2008 తర్వాత తాము చూసిన ప్రశాంతమైన ఎన్నికల పండుగఅని అనేక మంది ఓటర్లు చెప్పుకొచ్చారు.
రెహమాన్ బోగ్రా, ఢాకా -17 నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. జమాతే ఇ ఇస్లామ్ పార్టీ కొన్ని ప్రాంతాలలో ఓటింగ్ అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ప్రచారం సమయంలో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మరణించారని, 600 మందికి పైగా గాయపడ్డారు.
ALSO READ: ఉత్తర కొరియాలో కొత్త పరిణామాలు.. కిమ్ స్థానంలోకి కూతురు
బీఎన్పీ ఘన విజయం సాధించడంతో భారత్-బంగ్లా మధ్య సంబంధాలు బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికారంలోకి రానున్న పార్టీతో భారత్కు చెప్పుకోదగ్గ స్థాయిలో సంబంధాలు లేవు. రహ్మాన్ తల్లి జియా ఖాలిదా తీవ్ర అనారోగ్యానికి గురైన సమయంలో ప్రధాని మోదీ ఆనాడు ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతుండంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి కూడా. ఈ నేపథ్యంలో కాబోయే ఆ దేశ ప్రధాని రెహ్మాన్ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి? తల్లి అడుగు జాడలో నడుస్తున్నారా? పరిస్థితుల రీత్యా అడుగులు వేస్తారా? అనేది చూడాలి.
I convey my warm congratulations to Mr. Tarique Rahman on leading BNP to a decisive victory in the Parliamentary elections in Bangladesh.
This victory shows the trust of the people of Bangladesh in your leadership.
India will continue to stand in support of a democratic,…
— Narendra Modi (@narendramodi) February 13, 2026