Iran Vs America-Israel War: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులు ఫలితాలను ఇస్తున్నాయా? ఆ దేశంలోని అణు కేంద్రాలు ధ్వంసమవుతున్నాయా? తాజాగా మరొక అణు కేంద్రం ధ్వంసమైందా? దీనిపై మ్యాప్ ఆధారంగా ఇజ్రాయెల్ బయటపెట్టింది. ఈ విషయంలో ఇరాన్ ఎందుకు సైలెంట్గా ఉంది. ఇజ్రాయెల్ చెబుతున్న మాటల్లో నిజం ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఇరాన్ అణు కేంద్రాలు.. దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడి
ఇరాన్లో సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి అమెరికా-ఇజ్రాయెల్. ఇప్పుడు వాళ్ల టార్గెట్ అంతా అణు కేంద్రాలపై పడింది. ఆయా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకుని మిస్సైళ్లతో దాడులు చేస్తున్నాయి. ఫలితంగా ఆయా న్యూక్లియర్ సైట్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. గడిచిన నాలుగైదు రోజుల్లో ఇరాన్లోని మూడు అణు కేంద్రాలు ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.
గతేడాది జూన్ యుద్ధం తర్వాత ఇరాన్ తరలించిన రహస్య అణు స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీప సరిహద్దుల్లో మింజాదెహైలో రహస్యంగా ఉన్న న్యూక్లియర్ కేంద్రం కాంపౌండ్పై దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు నిరంతరాయంగా పని చేస్తున్నట్లు సమాచారం.
నోరు మెదపని ఇరాన్.. అదేమీ లేదన్న IAEA అధినేత
జూన్లో జరిగిన ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ కంటే.. నాలుగు రోజులుగా జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్పై భారీగా మిస్సైళ్లు జారవిడిచిందని ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న దాడులు చేస్తున్నా ఇరాన్ తన అణు కార్యకలాపాలను ఆపలేదన్నారు. అణ్వాయుధాలకు అవసరమైన వాటిని అభివృద్ధి చేస్తూనే ఉందన్నారు.
భూగర్భ ప్రదేశాన్ని ఉంచిన మింజాదెహై ప్రాంతంలో అణ్వాయుధాలకు అవసరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి రహస్యంగా అణు శాస్త్రవేత్తల బృందం పని చేస్తోందని చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ సైన్యం మాటలు ఇలా ఉంటే.. IAEA అధినేత రాఫెల్ గ్రోసీ మాటలు మరోలా ఉన్నాయి.
ALSO READ: ఇరాన్ కొత్త సుప్రీం ముజ్తబా ఖమేనీ.. తండ్రి తర్వాత కొడుక్కి పగ్గాలు, సైన్యం ఒత్తిడితో
ఇరాన్ దగ్గర అణుబాంబు సిద్ధంగా లేదన్నారు. అణుబాంబు తయారు చేస్తోందనడానికి ఇరాన్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కేవలం యురేనియం నిల్వలు మాత్రమే ఉన్నాయని రాఫెల్ గ్రోసీ తెలిపారు. మొత్తానికి అమెరికా-ఇజ్రాయెల్ అధినేత మాటలు ఒకలా.. IAEA అధినేత రాఫెల్ మాటలు మరొకలా ఉన్నాయి. సీఐఏ మాజీ అధికారుల వెర్షన్ మరోలా ఉంది. న్యూక్లియర్ సైట్స్ భూమికి 50 మీటర్ల లోతుగా ఉంటాయని అంటున్నారు. దానిపై స్లాబ్ దాదాపు ఆరేడు మీటర్లు మందతో ఉంటాయని, మిస్సైళ్లు వేసికా అవేమీ చెక్కు చెదరవని అంటున్నారు. తాజా వ్యవహారాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.