Israel Attacks Tehran Airports: Middle East లో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. ఇరాన్ వైమానిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) టెహ్రాన్పై భీకర దాడులకు దిగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మూడు ప్రధాన విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, రవాణా విమానాలు ధ్వంసమైనట్లు ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది.
ఇరాన్ తన క్షిపణి దాడులకు.. డ్రోన్ ఆపరేషన్లకు ఉపయోగించే కీలక విమానాశ్రయాలపై ఈ దాడులు జరిగాయి. టెహ్రాన్లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరో రెండు సైనిక ప్రాధాన్యత కలిగిన వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని వెళ్లిన ఇజ్రాయెల్ క్షిపణులు హ్యాంగర్లలో ఉన్న ఇరాన్ వాయుసేన విమానాలను నేలమట్టం చేశాయి. ఇరాన్ వైమానిక దళాన్ని కోలుకోలేని దెబ్బ తీయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని ఐడీఎఫ్ వెల్లడించింది.
ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్పై జరిపిన డ్రోన్.. క్షిపణి దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ‘ఎయిర్ సుపీరియారిటీని దెబ్బతీయడం ద్వారా ఆ దేశం భవిష్యత్తులో గగనతలం నుండి దాడులు చేయకుండా అడ్డుకోవాలని ఇజ్రాయెల్ వ్యూహం రచించింది. ఈ దాడుల తర్వాత టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఆకాశంలో పొగ మేఘాలు కమ్ముకున్నాయని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే, ఇరాన్ తన నష్టంపై ఇప్పటివరకు పూర్తి స్థాయి అధికారిక ప్రకటన చేయలేదు, కానీ తమ రక్షణ దళాలు కొన్ని క్షిపణులను అడ్డుకున్నట్లు పేర్కొంది.
రెండు శక్తివంతమైన దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైతే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. అమెరికా ఈ దాడులపై స్పందిస్తూ.. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునే హక్కును కలిగి ఉందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉండటంతో, యుద్ధం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది.
Read Also: ఎట్టకేలకు బయటకు వచ్చిన ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ.. నేరుగా వార్ రూమ్లోకి ఎంట్రీ, ఏఐ అంటూ..