Sub Sea Cables: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు సంక్షోభం నెలకొంది. ఇరాన్ యుద్ధం మరో ప్రమాదానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన రెండు డిజిటల్ కారిడార్ లు పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం మీదుగా ఉన్న సముద్రగర్భ కేబుల్ మార్గాలకు ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ కు అంతరాయం కలిగితే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది.
ఇటీవలి సమావేశంలో టెలికమ్యూనికేషన్ల శాఖ టెలికాం, సబ్సీ కేబుల్ ఆపరేటర్లను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని సూచించింది. యుద్ధం నేపథ్యంలో కొత్త కేబుల్ విస్తరణలకు ఆలస్యం కావొచ్చని, సబ్ సీ కేబుళ్లకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని తెలిపింది. భారత్-యూరప్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సబ్ సీ కేబుళ్లను రక్షించేందుకు ఇరాన్తో చర్చలు జరపడానికి పలు కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
ఇంటర్నేషనల్ డేటాలో దాదాపు 95 శాతం సముద్రగర్భ కేబుళ్ల ద్వారా ట్రాన్స్ ఫర్ అవుతుంది. ప్రస్తుతం ముంబై, చెన్నై, కొచ్చిన్, తూత్తుకుడి, త్రివేండ్రంలోని 14 ల్యాండింగ్ స్టేషన్లలో 17 కేబుళ్లు ఉన్నాయి. ఎర్ర సముద్రం, హర్మూజ్ జలసంధిలో సబ్ సీ కేబుళ్లు డెంజర్ జోన్ లో ఉన్నాయి. గత సంవత్సరం ఎర్ర సముద్రంలో కేబుళ్లకు జరిగిన నష్టాన్ని మరమ్మతు చేయడానికి చాలా నెలల సమయం పట్టింది. అనేక అంతర్జాతీయ కేబుళ్లు ఈ మార్గాల్లో వెళుతున్నందున, ఏ చిన్న అంతరాయం జరిగినా భారతదేశ ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు మిడిల్ ఈస్ట్, ఐరోపా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్పై కూడా ప్రభావం చూపుతుంది.
ఇంటర్నెట్ అంతరాయాలు ఆర్థిక లావాదేవీలను ఆలస్యం చేయనున్నాయి. అలాగే ఈ-కామర్స్, సోషల్ మీడియా, ఐటీ సేవలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను ప్రభావితం చేస్తాయని అధికారులు పేర్కొన్నారు.
పూర్తి ఇంటర్నెట్ బ్లాక్అవుట్ సంభవించే అవకాశం లేనప్పటికీ, పరిమిత మార్గాలు, ల్యాండింగ్ పాయింట్లపై ఆధారపడటం వల్ల పలు సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్లను మెరుగుపరచడం, ఈస్ట్ కనెక్టివిటీని విస్తరించడం, దేశీయ కనెక్టివిటీ సామర్థ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.
భారతదేశపు ఇంటర్నెట్ ట్రాఫిక్ లో సుమారు మూడింట రెండు వంతులు ముంబై ద్వారా, మిగిలినది చెన్నై ద్వారా ట్రాన్స్ ఫర్ అవుతుంది. కనెక్టివిటీ అంతరాయాల సమయంలో ట్రాఫిక్ను ఈస్ట్ మార్గంలో మళ్లించగలిగినప్పటికీ, అలాంటి సమయంలో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గి, రద్దీకి దారితీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
పర్షియన్ గల్ఫ్లోకి ఎంటర్ అయ్యే హర్మూజ్ జలసంధి, 2,000 కిలోమీటర్ల దూరంలోని ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్, హిందూ మహాసముద్రంతో కలిపే బాబ్-ఎల్-మండేబ్ వంటి మార్గాలలో ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం రెండింటిలోని సబ్ సీ ఇంటర్నెట్ సదుపాయాలు యుద్ధం కారణంగా ప్రమాదంలో పడ్డాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ దాదాపుగా దిగ్బంధించింది. ఇరాన్ మద్దతుగా హూతీలు బాబ్-ఎల్-మండేబ్ను అడ్డుకుంటామని బెదిరిస్తున్నారు.
Also Read: ఖార్గ్ ఐలాండ్ ఆపరేషన్కు అమెరికా ప్లాన్? భారీగా ఇరాన్ బలగాలు, ఆ భయం..
గల్ఫ్లో ఉద్రిక్తతలు పెరగడంతో కీలక కేబుల్ ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. భారతదేశాన్ని పశ్చిమ ఆసియాతో, అక్కడి నుంచి ఐరోపాతో కనెక్ట్ చేసే మెటా ప్రాజెక్ట్, ఆల్కాటెల్ సబ్మెరైన్ నెట్వర్క్స్ ప్రస్తుతానికి నిలిచిపోయాయి. కేబుల్లోని చాలా భాగాలు ఇప్పటికే నిర్మించారు. ఈ వివాదంతో ఫైనల్ ఫేజ్ వర్క్ కు అంతరాయం ఏర్పడింది.