Karachi Robbery: మార్కెట్లో బంగారం ధర అమాంతంగా పెరిగింది. ఇప్పటికీ 10 గ్రాముల బంగారం లక్షన్నరకు పైగానే పలుకుతోంది. ఒడిదుడుకులకు లోనైనా కాస్త అటు ఇటు కదలాడుతోంది. దీంతో దోపిడీ దొంగల చూపు ఇప్పుడు బంగారం షాపులపై పడింది. తాజాగా 300 మిలియన్ల విలువైన బంగారం దోపిడీ చేశారు. ఈ ఘటన పాకిస్థాన్ చరిత్రలో అతి పెద్దది. ఇంతకీ దోపిడీ ఎలా జరిగింది?
కరాచీ సిటీ చరిత్రలో అతి పెద్ద దోపిడీ
పాకిస్తాన్లోని కరాచీ సిటీలో భారీ దోపిడీ జరిగింది. మలీర్లో ఉన్న ఇక్బాల్ జ్యువెలరీ షాపులో సుమారు 300 మిలియన్ అంటే 30 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు దోచుకెళ్లారు దొంగలు. వరుసగా సెలవులు రావడంతో దీన్ని తమకు అనుకూలంగా మలచుకుని దోపిడీకి పాల్పడ్డారు.
పాకిస్తాన్లోని అతిపెద్ద నగరం కరాచీ. నిత్యం వేలాది మంది పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తుంటారు. మాలిర్లోని పాక్ కాలనీలో వారాంతపు సెలవులను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు దొంగలు. ఆపై దోపిడీకి పాల్పడ్డారు. ఇక్బాల్ జ్యువెలరీ షాపు వెనుక గోడలో రంధ్రం చేసి ఖజానాలోకి ప్రవేశించారు. బంగారు ఆభరణాలు, వజ్రాలు భారీ మొత్తంలో దోచుకెళ్లారు.
బంగారం షాపుకి కన్నం.. 30 కోట్ల బంగారం, వజ్రాలు చోరీ
కరాచీ మార్కెట్కు శుక్రవారం, శనివారం సెలవులు వచ్చాయి. ఆదివారం కస్టమర్ల కారణంగా షాపు ఓపెన్ చేశాడు ఓనర్. షాపు చోరీ అయిన విషయం తెలియగానే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. షాపు వెనుక గోడకు రంధ్రం చేసి దొంగలు లోపలికి ప్రవేశించారు. నగలు భద్రపరిచే చోట రంధ్రం ఉంది.
దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే తెలిసినవారు దీని వెనుక ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నార్మల్గా ఫిబ్రవరి 12న అంటే గురువారం షాపు మూసివేశారు. ఆ తర్వాత శుక్రవారం, శనివారం సెలవులు వచ్చాయి. షాపు తాము తెరిచినప్పుడు ఉద్యోగులు బంగారం, వజ్రాలున్న బాక్సులు ఖాళీగా కనిపించాయని పోలీసుల దృష్టికి తెచ్చాడు ఓనర్ అయూబ్ ఖాన్. బంగారు ఆభరణాలు, బంగారు కడ్డీలు, వజ్రాలు చోరీ అయినట్టు వివరించాడు.
ALSO READ: ఏలియన్స్ నిజమే.. 51 రహస్యం చెప్పిన బరక్ ఒబామా
రెండు రోజుల్లో చోరీ జరిగినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. 700 తులాల బంగారం బిస్కెట్లు చోరీకి గురైనట్టు ఫిర్యాదులో ప్రస్తావించాడు. ప్రస్తుతం షాపులోని ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కరాచీ సిటీ చరిత్రలో భారీ దోపిడీలో ఇది కూడా ఒకటిగా అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఇంకోవైపు సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఉన్నట్లుండి కరాచీలో ఈ స్థాయి దోపిడీ జరగడంతో బంగారం షాపు యజమానులు భయంతో వణుకుతున్నారు.