Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టి అంతా ఇండియాపై పడిందా? కీలక రంగాలపై ఏదో విధంగా సుంకాలు విధించాలని ఆలోచన చేస్తున్నారా? ఇండియా కంపెనీలను అమెరికాకు రప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నారా? ఈ నేపథ్యంలోనే జెనరిక్ మందులను ఆయన టార్గెట్ చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మరో బాంబు పేల్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్-అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే జెనరిక్ మందులపై దశలవారీగా సుంకాలను విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. రెండేళ్లపాటు ఆయా మందులపై అమెరికాకు సుంకం లేకుండా వస్తూనే ఉంటాయని, ఆ తర్వాత భారీగా సుంకాలు పెంచుతామన్నారు.
జెనరిక్ మందులపై 200 శాతం సుంకాలు- ఆగస్టు 2028 వరకు అమలులో ఉంటుందన్నారు. మూడో ఏడాదిలో 100 శాతం సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. నాలుగో ఏడాది అంటే నుంచి ఈ సుంకాలు 200 శాతానికి పెంచుతామని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో జనరిక్ ఔషధాలు ఉత్పత్తి చేసే కంపెనీలు తమ దేశంలో కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని సూచన చేశారు.
అమెరికా ప్రజల కోసం మాత్రమే-ఔషధాలను దేశీయంగా ఉత్పత్తి చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పేటెంట్ పొందిన, బ్రాండెడ్ లేదా నూతన ఆవిష్కరణ మందుల విధానంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అమెరికా వ్యాప్తంగా గతంలో లేని విధంగా ఔషధ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నారని చెప్పారు. ఈ విధానం అమెరికా ప్రజలను రక్షించడమేనన్నారు.
అమెరికాలో భారత్ వాటా ఎంత? ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు జెనరిక్ మందులను సరఫరా చేస్తోంది భారత్. అందుకే భారతదేశాన్ని ప్రపంచ ఫార్మసీగా చెబుతున్నారు. ఇక అమెరికాలో భారతీయ జెనరిక్ మందులు దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా స్యూటికల్స్ను అమెరికాకు ఎగుమతి అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం చేసిన మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 38 శాతంగా ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఓ నివేదిక తెలిపింది.
ట్రంప్ కొత్త సుంకాల బెదిరింపులు భారతీయ ఔషధ కంపెనీలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్-అమెరికా మధ్య ఫిబ్రవరిలో ఓ వాణిజ్య ఒప్పందం జరిగింది. ప్రధాన ఫార్మాస్యూటికల్ కంపెనీలు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీని ఫలితంగా బిలియన్ల డాలర్ల విలువైన మందులకు సుంకాల నుండి మినహాయింపు లభించిందని చెబుతున్నారు.
ALSO READ: NEET లీకేజీ పై పోరుబాట.. రాహుల్ ముక్కు నుంచి రక్తం.. రంగంలోకి దిగిన సోనియా!
ట్రంప్ ప్రకటించిన విధానం అమల్లోకి వస్తే భారత ఫార్మా కంపెనీలు అమెరికాలో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే భారీ టారిఫ్ల కారణంగా అమెరికా మార్కెట్లో భారత్ ఉత్పత్తుల ధరలు అమాంతంగా పెరుగుతాయి. అమెరికాలో తయారీ చేసే కంపెనీలకు దీర్ఘకాలంలో ప్రయోజనం కలగవచ్చని అంటున్నారు. ట్రంప్ ప్రకటనపై అంతర్జాతీయ ఔషధ కంపెనీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.