Myanmar Earquake Sagaing Fault| మయన్మార్, థాయ్లాండ్ దేశాలను భూకంపం కుదిపేసింది. ఈ తీవ్ర భూకంపంతో ప్రపంచం ఊలిక్కిపడింది. ఈ విలయం కారణంగా ఎత్తైన భవంతులు, పురాతన వంతెనలు సహా అనేక కట్టడాలు కుప్పకూలిపోయాయి. ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంది. అందిన సమాచారం మేరకు దాదాపు 700 మందికి పైగా చనిపోయారని అంచనా. ఓ భవనం కూలడంతో శిథిలాల కింద 50 మంది చిక్కుకున్నారు. నేల మట్టమైన భవనాల కింద వేలాది మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ భూకంపంతో వేలాది భారీ నిర్మాణాలు నేల మట్టమయ్యాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది. భూకంప కేంద్రం మధ్య మయన్మార్లో (Myanmar) ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది ‘సగాయింగ్ ఫాల్ట్’కు సమీపంలో ఉంటుంది. అసలేమిటీ ప్రాంతం..? ఇక్కడే ఎందుకు తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి..?
సగాయింగ్ ఫాల్ట్ అంటే భూగర్భంలో..
సాధారణంగా భూమి పైపొరలో అనేక ఫలకాలు (టెక్టానిక్ ప్లేట్స్ – Techtonic Plates) ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్ల మధ్య సగాయింగ్ ఫాల్ట్ (Sagaing Fault) ఉంటుంది. మయన్మార్లో ఇది దాదాపు 1200 కి.మీల మేర విస్తరించి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
భూ ఫలకాలు ఎప్పుడూ కదులుతుంటాయి. ఈ కదలికలు సగాయింగ్ ఫాల్ట్లో ఏడాదికి 11 మి.మీ నుంచి 18 మి.మీ వేగంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 18 మి.మీ అంటే చాలా ఎక్కువ అని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగుతుండటంతో.. కాలక్రమేణా అంచుల వద్ద రాపిడికి గురై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. ఒత్తిడి మరీ ఎక్కువ ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే.. నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫలకాలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్ ప్రాంతంలో తరచూ భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: థాయ్లాండ్లో సునామీ! భారత్కు ముప్పు!
గతంలోనూ భయానక భూకంప ఘటనలు
సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్లో గతంలో అనేక భూకంపాలు సంభవించాయి. రెడ్ జోన్లో ఉన్న మయన్నార్, థాయ్ల్యండ్ ప్రాంతాలలో గత వందేళ్ల చరిత్ర చూస్తే.. తీవ్రత 6 కంటే ఎక్కువగా ఉండే 14 భూకంపాలు సంభవించినట్లు అంచనా. 1946లో 7.7 తీవ్రతతో రాగా.. 1956లోనూ 7.1 తీవ్రతతో భూమి కంపించింది. 1988లో షాన్లో, 2004లో కోకో ద్వీపంలో వచ్చిన బలమైన ప్రకంపనలతో వందలాది మంది చనిపోయారు. 2011లో టార్లేలో వచ్చిన భూకంపంలో 151 మంది ప్రాణాలు కోల్పోయారు, 2016లోనూ 6.9 తీవ్రతతో రాగా.. తాజాగా 7.7 తీవ్రతతో ఇది సంభవించింది.
మయన్మార్ను ఆదుకుంటాం : ప్రధాని మోదీ
మయన్మార్ (Myanmar earthquake)ను కుదిపేసిన భూకంపంపై భారత ప్రధాన మంత్రి మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్లో వరుసగా స్వల్ప వ్యవధిలో రిక్టర్ స్కేలుపై 7.7, 6.4 భూకంప తీవ్రత నమోదైంది. ఆ భూకంపంపై ప్రధాని మోదీ ద్రిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భూకంపం ప్రభావం నేపథ్యంలో మయన్మార్, థాయిలాండ్ దేశాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతుంది. అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది.
భూమి లోపల.. పది కిలోమీటర్ల మేర భూకంపం
మయన్మార్ వాయువ్య భాగమైన సాగైంగ్కు 16కిలోమీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మయన్మార్లో గతంలో కూడా సాగైంగ్కు భూకంపాలు సంభవించిన చరిత్ర ఉంది. ఈసారి కూడా అదే ప్రాంతంలో భూకంపం రావడం గమనార్హం.