America-Iran War Cost: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా సాగిస్తున్న పోరాటం ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనలో పడేస్తోంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం నెల రోజులు గడిచినా శాంతించే సూచనలు కనిపించడం లేదు. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తాజా గణాంకాల ప్రకారం, అమెరికా ఈ యుద్ధం కోసం చేస్తున్న ఖర్చు ఊహాతీతంగా ఉంది. ప్రతి సెకనుకు దాదాపు 10,300 డాలర్లు (సుమారు రూ. 9.8 లక్షలు) హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. యుద్ధం ప్రారంభమైన 31 రోజుల్లోనే అమెరికా ఖజానా నుండి ఏకంగా 27.68 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2.63 లక్షల కోట్లు) ఖర్చయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ట్రంప్ వ్యూహం.. ఆయుధాలకే సింహభాగం
ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా తన సైనిక శక్తిని గరిష్ట స్థాయిలో ఉపయోగిస్తోంది. రోజుకు సగటున 890 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,455 కోట్లు) వెచ్చిస్తూ ఇరాన్ రక్షణ కవచాలను ఛేదించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో అత్యధిక భాగం, అంటే రోజుకు దాదాపు రూ. 3,040 కోట్లు కేవలం క్షిపణులు, అత్యాధునిక ఆయుధాల కోసమే ఖర్చవుతోంది. టోమహాక్ క్రూయిజ్ క్షిపణులు, జేడీఏఎం బాంబుల ప్రయోగంతో యుద్ధ క్షేత్రం దద్దరిల్లుతోంది. కేవలం ఆయుధాలే కాకుండా, వైమానిక, నౌకాదళ కార్యకలాపాల కోసం రోజుకు మరో రూ. 3,500 కోట్లకు పైగా వ్యయం జరుగుతోంది.
అత్యాధునిక రక్షణ వ్యవస్థలు.. నిఘా నీడ
కేవలం దాడులకే పరిమితం కాకుండా, ఇరాన్ నుండి ఎదురయ్యే ప్రతిఘటనను అడ్డుకోవడానికి అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. థాడ్ (THAAD), పేట్రియాట్ వంటి అత్యంత ఖరీదైన క్షిపణి రక్షణ వ్యవస్థల నిర్వహణ కోసం రోజుకు రూ. 900 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. దీనికి తోడు సైబర్ ఆపరేషన్లు, డ్రోన్ నిఘా, గూఢచార వ్యవస్థల కోసం రోజుకు మరో రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఇరాన్ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని భారీగా వాడుతుండటం వల్ల ఈ యుద్ధ వ్యయం మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంది.
ఆర్థిక భారం.. మిత్రదేశాలపై ట్రంప్ కన్ను?
పెరుగుతున్న యుద్ధ వ్యయం అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా చూసేందుకు ట్రంప్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. 1990 గల్ఫ్ యుద్ధం తరహాలో అరబ్ దేశాల నుండి ఆర్థిక సహకారం ఆశించే సంకేతాలు వైట్హౌస్ నుండి వస్తున్నాయి. “అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో మిత్రదేశాల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారు” అని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పష్టం చేయడం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే, నాటి మిత్రపక్షాల ఐక్యత నేడు కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్లు ఏకపక్షంగా ముందుకు వెళ్తుండటంపై అరబ్ దేశాల స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: ఇరాన్ కోస్తల్ ఏరియా.. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ప్రాంతం వీడియో ఇదిగో
ప్రతీకార జ్వాలలు – చర్చలకు ససేమిరా!
మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తేనే శాంతి చర్చలకు వస్తామని ఆ దేశం భీష్మించుకుని కూర్చుంది. ప్రతిచర్యగా మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. అగ్రరాజ్యం తన ఆర్థిక బలాన్ని, సైనిక సంపత్తిని ప్రదర్శిస్తున్నా, ఇరాన్ గట్టిగానే ప్రతిఘటిస్తోంది. ఇరుపక్షాల మొండి వైఖరి వల్ల ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక అంతర్జాతీయ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.