AP DSC 2026: డీఎస్సీ అభ్యర్థులకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించాను. ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు.
‘ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్, 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డీఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాను. టెట్, డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి. కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తాం’- మంత్రి లోకేశ్
2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్యసాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 78మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యాప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ ప్రభుత్వం ఇటీవల మెగా డీఎస్సీను నిర్వహించింది. మొత్తం 16 వేలకుపైగా టీచర్ల పోస్టులను భర్తీ చేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ, పరీక్షలు, ఫలితాలు సహా కేవలం ఐదు నెలల్లోనే ప్రక్రియను పూర్తిచేసింది. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ నెలలోనే నియామక పత్రాలను అందించింది. ప్రస్తుతం ఉపాధ్యాయులకు ప్లేస్మెంట్స్ కౌన్సెలింగ్ జరుగుతోంది.
మరోవైపు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అంతర్ జిల్లాల బదిలీల టీచర్లు, భాషా పండిట్స్తో మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి నంబర్వన్ చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. అందుకు టీచర్ల సహకారం కావాలన్నారు.