AC Side Effects: వేసవి కాలంలో రాత్రంతా ఏసీ ఆన్ చేసుకుని పడుకోవడం చాలామందికి అలవాటు. అయితే, ఉదయం లేవగానే జివ్వున లాగుతూ తలనొప్పి రావడం కూడా అంతే సర్వసాధారణం అయిపోయింది. చాలామంది దీనికి ఏసీనే కారణం అనుకుంటారు. కానీ, నోయిడా మేదాంత హాస్పిటల్ న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ నమితా కౌల్ ప్రకారం.. సమస్య ఏసీతో కాదు, అది క్రియేట్ చేసే వాతావరణం వల్ల వస్తుంది. రాత్రంతా చల్లటి గాలికి ఒంటిని ఎక్స్పోజ్ చేయడం, డీహైడ్రేషన్, కండరాల బిగుతు వంటి కారణాల వల్లే ఈ మార్నింగ్ హెడేక్స్ వస్తాయి.
రాత్రంతా ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి నేరుగా శరీరంపై పడటం వల్ల మెడ, భుజాలు, తల భాగంలోని కండరాలు బాగా బిగుసుకుపోతాయి. ఈ స్టిఫ్నెస్ వల్ల ఉదయం లేవగానే నుదురు, కనుబొమ్మల భాగంలో విపరీతమైన ఒత్తిడి, నొప్పులు మొదలవుతాయి. దీనినే టెన్షన్ హెడేక్ అంటారు. మనం పడుకునే పొజిషన్ సరిగ్గా లేకపోయినా ఈ నొప్పి మరింత ఎక్కువవుతుంది.
ఏసీ గదిలోని వేడిని తగ్గించడంతో పాటు గాలిలో ఉండే తేమను (హ్యుమిడిటీ) కూడా లాగేస్తుంది. దీనివల్ల రూమ్ మొత్తం పొడిగా మారుతుంది. పగటిపూట సరిగ్గా నీళ్లు తాగని వారు, ఇలాంటి పొడి వాతావరణంలో రాత్రంతా పడుకోవడం వల్ల శరీరం మరింత డీహైడ్రేషన్కు గురవుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడం వల్లే ఉదయాన్నే తలనొప్పి, నీరసం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మైగ్రేన్ ఉన్నవారికి ఇది మరింత త్వరగా ఎఫెక్ట్ చూపిస్తుంది.
Also Read: జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే హోమ్ రెమెడీ.. రోజూ ఒక గ్లాస్ తాగితే ఫుల్ హెల్తీ!
ఏసీ నుంచి వచ్చే పొడి, చల్లటి గాలి మన ముక్కు లోపలి పొరలను (నాసికా రంధ్రాలను) ఇరిటేట్ చేస్తుంది. దీనివల్ల ముక్కు బ్లాక్ అవ్వడం లేదా సైనస్ సమస్యలు ఉన్నవారికి ముఖంపై, కళ్ల చుట్టూ ఏదో బరువు పెట్టినట్లు అనిపిస్తుంది. ఈ అలర్జీల వల్లే సైనస్ తలనొప్పులు ముంచుకొస్తాయి. ముఖ్యంగా ఆస్తమా, మైగ్రేన్, సర్వికల్ స్పైన్ సమస్యలు ఉన్నవారు ఈ వాతావరణానికి త్వరగా ప్రభావితం అవుతారు.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏసీ గాలి నేరుగా మన శరీరంపై పడకుండా చూసుకోవాలి. రూమ్ టెంపరేచర్ను మరీ చల్లగా కాకుండా మీడియంగా సెట్ చేసుకోవాలి. పగటిపూట పడుకునే ముందు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. గదిలో మరీ పొడి వాతావరణం ఉంటే హ్యుమిడిఫైయర్ వాడటం మంచిది. చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా తలనొప్పి లేకుండా ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు.
Also Read: టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!