Peeing: అవసరం వచ్చినప్పుడు టాయిలెట్కు వెళ్లకుండా.. ఎంతసేపటికీ మూత్రాన్ని ఆపుకునే అలవాటు ప్రాణాలనే తీయొచ్చు. అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది . 28 ఏళ్ల ఓ కార్పొరేట్ మహిళా ఉద్యోగి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పని మీద బయటకు వెళ్లినప్పుడు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణాల సమయంలో మూత్రాన్ని తరచుగా ఆపుకోవడం వల్ల ఆమెకు ఇన్ఫెక్షన్ ఏర్పడిందని, అదే క్రమంలో అది రక్తంలోకి వ్యాపించి పరిస్థితి తీవ్రమైందని ఒక వైద్యుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఆ మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటికీ.. ఇన్ఫెక్షన్ ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపారు.
ఈ ఘటన మహిళలు, ముఖ్యంగా ఉద్యోగ రీత్యా ఎక్కువసేపు ప్రయాణించే వారు లేదా పని ఒత్తిడితో మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. సాధారణంగా కనిపించే సమస్యగా భావించే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల శరీరానికి కలిగే నష్టాలు చాలామందికి పూర్తిగా తెలియవు. చిన్న అలవాట్లే పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని నిపుణులు చెబుతుంటారు. మూత్ర విసర్జనను తరచూ నిర్లక్ష్యం చేస్తే శరీరంలో ఏమేం మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రాశయం నిండిన వెంటనే మెదడు మూత్ర విసర్జన చేయాల్సిందిగా సంకేతాలు పంపుతుంది. అయితే ఆ సంకేతాలను పట్టించుకోకుండా మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే, మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువవుతాయి. ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కడుపు కింది భాగంలో నొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు.
తరచూ మూత్రం ఆపుకోవడం వల్ల ఒక్క UTI మాత్రమే కాదు.. పలు రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం చాలామంది యూరిన్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే శరీరం మీకు సంకేతాలు పంపినప్పుడు మూత్ర విసర్జన చేయడం చాలా అవసరం.
మూత్రం వచ్చినప్పటికీ విసర్జన చేయకపోతే మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కాలక్రమేణా మూత్రాశయం పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ఇలా జరగడం భవిష్యత్తులో మూత్ర నియంత్రణ సమస్యలు సహా ఇతర క్లిష్టతలకు దారితీయవచ్చు.
సరైన సమయంలో మూత్ర విసర్జన జరగకపోతే, యూరిన్లోని మలినాలు క్రమంగా గట్టిపడి రాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. ఇవి కిడ్నీల్లో చేరి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కాబట్టి.. మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా.. విసర్జన చేయడం ఎంతైనా అవసరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి తీవ్రమైతే మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు కూడా రావచ్చు. అందుకే మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకుండా ఎప్పటిప్పుడు టాయిలెట్కు వెళ్లాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరం చెప్పే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైన సమయంలోనే మూత్ర విసర్జన చేయడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.