బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కొత్త చిక్కులు వచ్చి పడినట్లు తెలుస్తున్నది. మున్ముందు గడ్డుపరిస్థితులను సైతం ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ బరువు బాధ్యతలను కేటీఆరే మోస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా అటు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూనే మరోవైపు ప్రజాసమస్యలపై నిలదీస్తున్నారు. మరోవైపు పార్టీలో నెలకొన్న పరిస్థితులపైనా ఫోకస్ చేస్తున్నారు.దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాది మార్చిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక సవాల్తో కూడుకున్నది.
గెలిచిన వారిని కాపాడుకోవడం మరింత సవాల్ కానుంది.
ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 30 శాతానికి పైగా సీట్లను దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. అయితే, గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో కొందరు ఎన్నికల టైంలో తమ సొంత ఖర్చులు పెట్టుకుని పోటీ చేసి గెలిచారు. పార్టీ నుంచి, సీనియర్ల నుంచ ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని వారంతా బాహాటంగానే చెబుతున్నారు. సర్పంచ్గా గెలవడానికి పెద్దమొత్తంలో ఖర్చు చేసిన అభ్యర్థులు ఊరిని అభివృద్ధి చేసేందుకు ఫండ్స్ కావలి? ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఉంటే నిధులు ఎలా వస్తాయని, అందులో అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే కేటీఆర్ ఆగమేఘాల మీద జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలకు వెళ్లి గెలిచిన గులాబీ సర్పంచులు అందరినీ ఒక చోటకు చేర్చి వారిని ముందుగా సన్మానించి, మీకు ఏది కావాలన్నా తనును అడగాలని, ఇబ్బందులు ఉంటే చెప్పాలని.. అందుకే మండలానికో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని భరోసా కల్పిస్తున్నట్లు తెలిసింది.ఇంతకాలం అధికారం లేకపోయినా ఓపిక పట్టారు. మరో రెండేండ్లు ఓర్చుకోవాలని..మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారికి ధీమా ఇస్తున్నారు. ఇలా ఒక్కోరోజు ఒక్కో జిల్లాలో కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.ముందుగా జంపింగ్ జపాంగులను గుర్తించి వారికి అన్నివిధాలుగా సాయం చేస్తామని, దిక్కులు చూడవద్దని భరోసానిస్తున్నట్లు సమాచారం.
దీనికి తోడు త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు.. జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి.అందుకు కేడర్ సిద్ధం కావాలని, నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కేటీఆర్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు టాక్. గతంలో అవకాశం రాని వారికి ఈసారి ఇస్తామని, పార్టీ విజయం కోసం కష్టపడాలని వారికి సూచించినట్లు తెలుస్తున్నది. అయితే, తనయుడితో పాటే పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు కేసీఆర్ రేపు (ఆదివారం) తెలంగాణ భవన్ రానున్నారు. అన్ని జిల్లాల కీలక నేతలతో ఆయన మాట్లాడుతారని, త్వరలోనే పెద్దఎత్తున చేపట్టే ప్రజాకార్యక్రమాలపై ఈ సందర్భంగా క్లారిటీ ఇస్తారని పార్టీలో చర్చ జరుగుతున్నది.