Care Insurance:హెల్త్ ఇన్సూరెన్స్… డబ్బులు సమయానికి లేకపోయినా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకూడదని ఎంతో మంది తీసుకునే పాలసీ.చాలామంది నమ్మకం ఒకటే.. అవసరమైన సమయంలో ఇది ఆదుకుంటుందని.
కానీ ఇప్పుడు తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు పెద్ద షాక్ తగిలింది. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (TSHA) తమకు చెందిన ఆస్పత్రుల్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు క్యాష్లెస్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వేలాది మంది పాలసీదారుల్లో ఆందోళన మొదలైంది.
ఆస్పత్రుల సంఘం చెబుతున్న ప్రకారం.. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో చాలా కాలంగా కొన్ని సమస్యలు అలాగే పేరుకుపోయాయి.ముఖ్యంగా క్లెయిమ్ మొత్తాలను తగ్గించడం, కొన్ని క్లెయిమ్లను తిరస్కరించడం, డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేయడం, ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా ఆస్పత్రులను నెట్వర్క్ నుంచి తొలగించడం వంటి అంశాలపై అనేక సార్లు చర్చలు జరిపినా పరిష్కారం దొరకలేదని TSHA తెలిపింది.
ఈ నిర్ణయంతో ఇబ్బంది పడేది ప్రధానంగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులే.ఇప్పటివరకు నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లగానే క్యాష్లెస్ సౌకర్యంతో చికిత్స పొందేవారు. కానీ ఇప్పుడు అదే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే ముందుగా రోగి లేదా కుటుంబ సభ్యులే మొత్తం బిల్లును చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ముందుగా ఆస్పత్రి బిల్లు చెల్లించిన తర్వాత.. ఆ బిల్లులు, అవసరమైన పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించి రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.అంటే చికిత్స సమయంలో చేతిలో డబ్బు లేకపోతే చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడబోతోందన్నమాట.
లక్షల రూపాయలు ఖర్చయ్యే సర్జరీలు, అత్యవసర చికిత్సల సమయంలో చాలామంది క్యాష్లెస్ సౌకర్యంపైనే ఆధారపడుతుంటారు.ఇప్పుడు ఆ అవకాశం లేకపోతే వెంటనే డబ్బు ఏర్పాటు చేసుకోవాలంటే తలకు మించిన భారమే.
ఇలాంటి పరిస్థితులు తెలంగాణలోనే మొదటిసారి రావడం కాదు.గతంలో కూడా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆస్పత్రులు, ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య క్లెయిమ్లు, చెల్లింపులు, ప్యాకేజీ రేట్ల విషయంలో వివాదాలు తలెత్తాయి. అయితే చాలా సందర్భాల్లో చర్చల ద్వారా సమస్యలు ఒక కొలిక్కి వచ్చాయి.
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నవారు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లే ముందు.. ఆ ఆస్పత్రిలో క్యాష్లెస్ సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది.అలాగే అత్యవసర పరిస్థితుల కోసం కొంత డబ్బును వెంట ఉంచుకోవడం మరింత మంచిది.
ప్రస్తుతం TSHA తీసుకున్న నిర్ణయం అమల్లో ఉంది.అయితే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ, ఆస్పత్రుల సంఘం మధ్య చర్చలు జరిగి సమస్యలు పరిష్కారమైతే.. క్యాష్లెస్ సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది.
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ పాలసీ ఏ ఆస్పత్రుల్లో పనిచేస్తుంది? క్యాష్లెస్ సౌకర్యం కొనసాగుతోందా? వంటి విషయాలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.ప్రస్తుతం తెలంగాణలో కేర్ హెల్త్ పాలసీదారులు ఆస్పత్రికి వెళ్లే ముందు ఒక్కసారి వివరాలు తెలుసుకుని వెళ్లడం మంచిది. ఇలా చేస్తే చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు.