Happy Children’s Day 2025: మనందరికీ బాల్యం మరుపురాని జీవితం. సమయం దొరికినప్పుడల్లా మనలో చాలామంది బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంటారు. అబ్బా.. ఆ ఆరోజులు ఎంత బాగుండేవో.. మళ్లీ ఒక్కాసారైనా ఆ కాలానికి వెళ్తే ఎంత బాగుంటుంది.. అని అందరూ అనుకున్న సందర్భాలు ఉంటాయి. అలాంటి బల్యానికి ఇస్తున్న కానుకే ఈ ‘బాలల దినోత్సవం’. ప్రతి ఏటా నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే జరుపుకుకోవడానికి కారణం లేకపోలేదు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్రోద్యమ కాలంలో నెహ్రూ ఎక్కువగా జైళ్లలోనే గడిపారు. ఆ సమయంలో తన కుమార్తె ఇందిరా గాంధీతో ఎక్కువకాలం గడపలేకపోయారట. అంతేకాదు.. నెహ్రూకి పిల్లలన్నా, గులాబీ పువ్వులన్నా ఎంతో మక్కువ. ఆయన పిల్లలను జాతి సంపదలుగా చెబుతుండేవారు. అందుకే ఆయన పుట్టినరోజున భారత్లో ‘బాలల దినోత్సవం’ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలల దినోత్సవం చరిత్ర, దాని ప్రాముఖ్యత వంటి వివరాల్లోకి వెళితే..
ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన తేదీ ప్రకారం.. తొలిసారి 1954లో ప్రపంచమంతటా చిల్డ్రన్స్ డే నిర్వహించారు. ఆ తర్వాత 1989లో పిల్లల హక్కులపై నవంబరు 14న ఐరాసా ఓ బిల్లును ఆమోదించింది. దీనికి 191 దేశాలు ఆమోదం తెలిపాయి. ఇక అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. చైనాలో జూన్ 1న, పాకిస్తాన్లో నవంబరు 20న, జపాన్లో మే 5న, దక్షిణ కొరియాలో మే 5న, పోలాండ్లో జూన్ 1న, శ్రీలంకలో అక్టోబర్ 1న ఇలా.. ఆయా దేశాల్లో బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.
1948లో నవంబరు 5న భారతదేశం తొలిసారిగా ‘ఫ్లవర్ డే’ని నిర్వహించింది. ఫ్లవర్ టోకెన్ల విక్రయం ద్వారా పిల్లల కోసం ఐక్యరాజ్యసమితి అప్పీల్ కోసం నిధులను సేకరించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ చేసిన ప్రయత్నమే ఈ చొరవ. అయితే, 1964లో జవహార్ లాల్ నెహ్రూ మరణించారు. అంతకు ముందువరకు.. ప్రపంచ దేశాలతో పాటు మనదేశంలోనూ నవంబరు 20వ తేదీన ప్రపంచ బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుండేది. మాజీ ప్రధాని నెహ్రూ చనిపోయాక.. ఆయనను స్మరించుకుంటూ ప్రతిఏటా ఆయన పుట్టినరోజైన నవంబరు 14ను బాలల దినోత్సవంగా జరుపుకోవాలని పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అలా అప్పటి నుంచి నవంబరు 14న భారతదేశంలో చిల్డ్రన్స్ డే జరుపుకోవడం అనేది ఆనవాయితీగా మొదలైందని చరిత్ర చెబుతోంది.
చిల్డ్రన్ష్ డే పిల్లలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యం అందించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. చిన్నారుల హక్కులను ప్రోత్సహించడం, వారి విద్య, శ్రేయస్సుకి పాటుపడటంతో పాటు, పోషకాహారం, ఇంట్లో సురక్షితమైన వాతావరణం కల్పించడం వంటి బాధ్యతలను గుర్తుచేస్తుంది. ఈ బాలల దినోత్సవాన్ని ప్రతిఏటా జరుపుకోవడం వల్ల పేదరికం, నిరక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, బాల కార్మికులుగా మారడం వంటి పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెరుగుతుంది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కులు, వారి అవసరాలను వెలుగులోకి తెచ్చే సందర్భం. ఇది బాల కార్మికులు, విద్య లేకపోవడం, దుర్వినియోగం వంటి తీవ్రమైన సమస్యలపై దృష్టి సారించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్యలపై చర్యలు తీసుకోవడానికి సమాజాలను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా.. ప్రతిఏటా చిల్డ్రన్స్ డే జరుపుకోవడం వారి సంరక్షణ, పరిశుభ్రత ఆవశ్యకత గురించి అవగాహన పెంచినట్లు అవుతుంది. పిల్లలే భారతదేశ భవిష్యత్తు. వారు దేశాన్ని ఎలా తీర్చిదిద్దగలరనే మాజీ ప్రధాని నెహ్రూ దార్శనికతను పునరుద్ఘాటించే రోజుకూడా.