Eating Disorders: నేటి యువత తీరు ఎలా ఉందంటే.. చుట్టూ ఉన్న మనుషులతో సంబంధం లేకుండా ఎంతసేపూ స్మార్ట్ఫోన్లో లీనమైపోతున్నారు. అసలు చేతిలో ఫోన్ లేనిదే క్షణం కూడా గడవదు అన్నట్టుగా ఉంటుంన్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు అయితే ఫోనే తమ ప్రపంచంగా భావిస్తున్నారు. అయితే, గంటల తరబడి స్క్రీన్ వైపు చూస్తూ గడపడం కేవలం నిద్రను, ఏకాగ్రతను మాత్రమే కాదు.. వారి శరీర ఆకృతిపై వారికి ఉండే అభిప్రాయాన్ని, ఆహారపు అలవాట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కింగ్స్ కాలేజ్ లండన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో స్మార్ట్ఫోన్ వాడకానికి, ఈటింగ్ డిజార్డర్స్కు మధ్య ఉన్న బలమైన సంబంధం వెల్లడైంది.
సుమారు 52,000 మందిపై జరిపిన 35 అధ్యయనాలను విశ్లేషించిన నిపుణులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. స్మార్ట్ఫోన్ వాడకం పెరిగేకొద్దీ, యువతలో అతిగా తినడం లేదా ఆహారానికి బానిస అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కేవలం మానసిక అనారోగ్యం ఉన్నవారే కాకుండా, సాధారణ వ్యక్తుల్లో కూడా ఈ మార్పులు వస్తుండటం గమనార్హం. ముఖ్యంగా రోజుకు ఏడు గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్ చూసేవారిలో ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.
Also Read: ఒంటరిగా ఉంటున్నారా? అయితే జాగ్రత్త.. మీకు షుగర్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువట!
టీనేజ్ అనేది శారీరకంగా, మానసికగా ఎదిగే కీలకమైన దశ. ఈ సమయంలో సోషల్ మీడియాలో నిరంతరం కనిపించే పర్ఫెక్ట్ బాడీ ఇమేజ్లు, ఫిల్టర్ చేసిన ఫొటోలు పిల్లల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. ఇతరులతో తమను తాము పోల్చుకోవడం వల్ల తమ శరీరం సరిగ్గా లేదనే అసంతృప్తి మొదలవుతుంది. ఈ ఒత్తిడి నుండి బయట పడటానికి కొందరు ఆహారం పట్ల అయిష్టత చూపుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్ల ద్వారా గుర్తింపు పొందాలని ఆరాటపడటం వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత దిగజారుస్తోంది.
ఈ సమస్యపై భయాందోళన చెందడం కంటే.. అవగాహన పెంచుకోవడం ముఖ్యం. స్మార్ట్ఫోన్ వాడకాన్ని నియంత్రించుకోవడంతో పాటు, పిల్లలతో బాడీ ఇమేజ్, మానసిక ఆరోగ్యం గురించి స్వేచ్ఛగా మాట్లాడాలి. పోషకాహారం ఎంత ముఖ్యమో, డిజిటల్ అలవాట్లు కూడా అంతే ముఖ్యమని తల్లిదండ్రులు గుర్తించాలి. ఫోన్ చూసే సమయాన్ని తగ్గించి, వాస్తవ ప్రపంచంతో అనుబంధాన్ని పెంచడం ద్వారా ఈ ముప్పు నుంచి బయటపడవచ్చు.
Also Read: గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నా చింత లేదు.. ఈ 5 పద్ధతులతో వంట చేయడం చాలా ఈజీ!