Diabetes Risk: ఎక్కువ సమయం ఒంటరిగా గడిపేవారిలో షుగర్ వస్తుందని మీకు తెలుసా? ఏంటీ షాక్ అవుతున్నారా.. అవును మీరు విన్నది నిజమే! కొన్నిసార్లు చుట్టూ వందల మంది ఉన్నా, లోలోపల ఒంటరితనంతో కుమిలిపోయే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే, ఈ ఒంటరితనం కేవలం మనసును మాత్రమే కాదు, నేరుగా మనిషి రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక దూరం పెరిగేకొద్దీ శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, అది టైప్-2 డయాబెటిస్కు దారితీసే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన శరీరం నిరంతరం ఒక రకమైన ఆందోళనకు గురవుతుంది. దీనివల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ పెరగడం వల్ల ఇన్సులిన్ పనితీరు మందగించి, కణాలకు గ్లూకోజ్ అందకుండా పోతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. దీనికి తోడు ఒంటరితనం వల్ల కలిగే నిద్రలేమి సమస్య రోగ నిరోధక శక్తిని తగ్గించి, జీవక్రియలను అస్తవ్యస్తం చేస్తుంది. ఇది క్రమంగా థైరాయిడ్ వంటి ఇతర సమస్యలకు కూడా కారణమవుతుంది.
Also Read: ఏ రంగు పుచ్చకాయలో పోషకాలు అధికం? ఏది తింటే ఆరోగ్యానికి ఎక్కువ లాభం?
ఒంటరిగా ఉండేవారిలో శారీరక శ్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. తోడు లేకపోవడం వల్ల బయటకు వెళ్లడం లేదా వ్యాయామం చేయడం వంటి పనులపై ఆసక్తి నశిస్తుంది. దీనివల్ల బరువు పెరగడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా.. ఒంటరితనం ఇచ్చే డిప్రెషన్ వల్ల ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. కొందరు అతిగా తినడం లేదా మరికొందరు సరైన సమయానికి పోషకాహారం తీసుకోకుండా జంక్ ఫుడ్స్ మీద ఆధారపడటం వల్ల డయాబెటిస్ రిస్క్ రెట్టింపు అవుతుంది.
ఒంటరితనం నుంచి బయటపడటం అంటే.. కేవలం నలుగురిలో ఉండటం మాత్రమే కాదు. మనసు విప్పి మాట్లాడే ఆత్మీయులను కలిగి ఉండటం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం శరీరంలో ఆక్సిటోసిన్ వంటి సంతోషాన్నిచ్చే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి రక్తపోటును, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి.. ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు, బలమైన సామాజిక బంధాలను ఏర్పరచుకోవడం మధుమేహాన్ని తరిమికొట్టడానికి మంచి మెడిసిన్లా పనిచేస్తుంది.
Also Read: పసుపు పుచ్చకాయలకు పెరిగిన డిమాండ్.. బెనిఫిట్స్ తెలిస్తే మీరూ వదలరు!