Pani Puri: వయసుతో సంబంధం లేకుండా చాలామంది పానీపూరీలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. పానీపూరీ చేయడంలో చాలామంది అపరిశుభ్రంగా వ్యవహరించడం చూస్తూనే ఉంటాం. కొందరు అపరిశుభ్రమైన చేతులతో పూరీ వడ్డిస్తుంటే.. మరికొందరు పానీలో మురుగు నీటిని కలుపుతుంటారు. కళ్లముందు ఇంత జరుగుతున్నా పానీపూరీ లవర్స్ మాత్రం వీటిని తినడం మాత్రం ఆపరు. ఇవేమీ పట్టించుకోకుండా తమకు నచ్చిన ప్రాంతానికెళ్లి మరీ పానీపూరీని లాగించేస్తుంటారు. అయితే తాజాగా యూపీకి చెందిన ఓ మహిళ గోల్గప్పాలు(పానీపూరీ) తింటూ దవడ విరగొట్టుకుంది. ఇప్పుడా మహిళ భరించలేనంత దవడ నొప్పితో ఆసుపత్రి పాలైంది.
తాజాగా 42 ఏళ్ల దేవి అనే మహిళ గోల్గప్పాలు(పానీపూరీ) తినడానికి వెళ్లి ఆసుపత్రి పాలైన అరుదైన సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. దేవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరప్రదేశ్లోని ఔరైయాగ్కు పని కోసం వెళ్లింది. ఆ పక్కనే ఉన్న ఓ దుకాణంలో పానీపూరి తిందామని వెళ్లింది. అయితే అక్కడ పానీపూరిని నోటిలో పెట్టుకుంటుండగా.. ఆమె దవడజారి నోరు మూసుకోలేకపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారుపడి చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు తీవ్రమైన దవడ నొప్పి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమె దవడను సరిచేయడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో ప్రత్యేక చికిత్స కోసం దేవిని చిచోలి మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఇలాంటి విషయాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు.
అధిక శాతం అమ్మాయిలే పానీపూరీలను ఇష్టంగా తింటుంటారు. ఈ క్రమంలో పానీపూరీ తినేటప్పుడు నోటిని చాలా వెడల్పుగా తెరుస్తుంటారు. ఇలా చేయడం వలన దవడ జారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. పూరీ సైజు కంటే నోటిని వెడల్పుగా తెరవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి.. పానీపూరీ తినేటప్పుడు నోటిని పెద్దగా కాకుండా.. నెమ్మదిగా తెరుస్తూ తినడం సరైన పద్ధతి అని చెబుతున్నారు.
రోడ్సైడ్ దొరికే పానీపూరీల వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పానీపూరీలో రుచి కోసం ఉప్పును ఎక్కువగా వాడుతుంటారు. అలాగే తెల్లటి మైదా పిండిని వినియోగిస్తుంటారు. ఇవి బరువును ఆటోమెటిక్గా పెంచేస్తుంటాయి. సోడియం కంటెంట్ అధికంగా వినియోగిస్తే జీర్ణ వ్యవస్థ పొరను దెబ్బ తీస్తుంది. ఇక పానీపూరీ నీళ్లలో కలిపే పచ్చిమిర్చి ముద్ద, ఇతర పదార్థాలతో అల్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే పానీపూరీ దుకాణాల్లో వినియోగించే నీరు అపరిశుభ్రంగా ఉంటే రోగాల బారిన పడవచ్చు.