Allu Arjun: మెగా మేనల్లుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ (Allu Arjun) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అల్లు అరవింద్ (Allu Aravindh) వారసుడిగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న ఈయన.. ఆ తర్వాత కాలంలో తన కుటుంబాల ఇన్ఫ్లుయెన్స్ ను ఏమాత్రం ఉపయోగించుకోకుండా.. తన అద్భుతమైన నటన సామర్థ్యంతో ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు నేషనల్ అవార్డు గ్రహీతగా పేరు సొంతం చేసుకున్నారు. అటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకుంటూ దూసుకుపోతున్న అల్లు అర్జున్ ఇటీవల ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజి పై దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలాంటి ఈయన ఈ మ్యాగజైన్ కోసం ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై చోటు దక్కించుకొని, మరో అరుదైన మైలురాయిని చేరుకున్న ఈయన ఫోర్బ్స్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అల్లు అర్జున్ తన నటన జీవితం గురించి మాట్లాడుతూ..” నేను నా జీవితంలో చేసిన అత్యంత సాహసోపేతమైన లేదా ఆల్ఫా పని ఏంటంటే.. అది పుష్ప సినిమాలో జాతర ఘట్టంలో ఒక మహిళలాగా చీర కట్టుకొని.. ఒంటికి రంగులు పూసుకొని నటించడమే.. నా ఉద్దేశంలో ప్రశంసలు పొందడమే కాదు విమర్శలను కూడా అంతే ధైర్యంగా ఎదుర్కోవడమే నిజమైన స్టార్డం అంటూ వివరించారు.
చిత్ర పరిశ్రమలో అనుభవించే ఒత్తిడి గురించి అల్లు అర్జున్ మాట్లాడారు.” నా దృష్టిలో ఒత్తిడి అరుదుగా లభించే ఒక గొప్ప వరం. అదృష్టం.. ఒకరకంగా చెప్పాలి అంటే అది దేవుడు ఇచ్చిన వరం. దేశంలో చాలా కొద్దిమందికి మాత్రమే అలాంటి బాధ్యతను, తీవ్రమైన ఒత్తిడిని మోసే అవకాశం లభిస్తుంది.
సినిమా కలెక్షన్స్ పై కూడా స్పందించారు. ఈ రోజులలో ప్రేక్షకులు చాలా తెలివైన వారు.. సాధారణ లేదా యావరేజ్ కంటెంట్ ను ఎంత మాత్రం ఆదరించడం లేదు. మనం నిజాయితీతో కూడిన ఒక గొప్ప చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తేనే.. దానికి రావాల్సిన మైండ్ బ్లాకింగ్ కలెక్షన్లు.. మిగిలిన బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ ఆ సినిమానే చూసుకుంటుంది అంటూ తెలిపారు.
also read:సుధీర్ రాకతో స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ!
పుష్ప సినిమా అందించిన విజయం, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరిన్ని ఎత్తులకు తీసుకెళ్లేలా నన్ను ప్రతిరోజు ప్రేరేపిస్తోంది అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే వీటన్నింటినీ అల్లు అర్జున్ పాటిస్తున్నారు కాబట్టే నేడు ఆయన గ్లోబల్ రేంజ్ లో స్టార్డం అందుకుంటున్నారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee ) దర్శకత్వంలో రాకా అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా రష్మిక మందన్న విలన్ షేడ్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.