APSRTC: టెక్నాలజీ ఓ వైపు.. మరోవైపు పోటీ నేపథ్యంలో ఏపీఎస్ఆర్సీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఆన్లైన్ లేకుంటే ఆర్టీసీ కౌంటర్లలో టికెట్ రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు శుభవార్త. ఇంటి వద్ద నుంచి బస్టాండ్కు వారిని తీసుకెళ్లేందుకు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం కేవలం విజయవాడ సిటీ ప్రయాణికులకు మాత్రమే.
ప్రజల వద్దకు సేవలు ఎలాగో.. ప్రయాణికుల వద్దకు ఆర్టీసీ బస్సులు కూడా రాబోతున్నాయి. ఈ తరహా పద్దతిని ఏపీఎస్ఆర్టీసీ తీసుకొచ్చింది. ప్రస్తుతం విజయవాడ నగరంలో శ్రీకారం చుట్టింది. ఇది సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఆన్లైన్ లేకుంటే ఆఫ్లైన్లో ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు తీపికబురు. ఆయా ప్రయాణికులను ఇంటి వద్ద నుంచి బస్టాండ్కు వారిని తీసుకెళ్లేందుకు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా ఆర్టీసీ అధికారి నీలిమ వెల్లడించారు. ఈ సదుపాయం విజయవాడ సిటీని ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తొలిదశలో విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఒకే చోట నుంచి బయలుదేరే ప్రయాణికులు కనీసం ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఈ తరహా సేవలు వినియోగించుకోవచ్చు.
టికెట్లు రిజర్వ్ చేసుకున్నవారితోపాటు, రిజర్వేషన్ చేసుకోవాలనుకునే ప్రయాణికులకు ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంటి వద్ద నుంచి బస్టాండ్కు సదుపాయం పొందాలనుకునే ప్రయాణికులు, తాము ఎక్కాల్సిన ప్రదేశం నుంచి బస్టాండ్ వరకు టికెట్ రుసుము చెల్లించాలి. ఇంటి వద్ద నుంచి బస్టాండ్ వరకు ఎంత దూరం ఉంటే దానికి సంబంధించిన ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం పొందాలనుకునే ప్రయాణికులు ప్రతీరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య అధికారులను సంప్రదించాలి. తాము ఎక్కాల్సిన బస్సు బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందుగా ఈ నెంబర్లకు 73828 25450, 99592 25450 ఫోన్ చేసి వివరాలు చెప్పాలి.
ALSO READ: వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్
విజయవాడ పీఎన్బీఎస్ నుంచి ఏపీ హైకోర్టుకు ఉదయం 9.10 నిమిషాలకు బయలుదేరు బస్సు.. సీడ్ యాక్సిస్ రోడ్ మీదుగా వెళ్తుందన్నారు. సీఆర్డీఏ, ఏపీ హైకోర్టుకు వెళ్లేలా మార్పు చేశామని తెలిపారు. ఉండవల్లి సెంటర్, పెనుమాక, మందడం మీదుగా ఏపీ హైకోర్టుకు వెళ్లే విధంగా అదనపు ట్రిప్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సూపర్ లగ్జరీ, ఏసీ, స్లీపర్ వంటి హైయ్యండ్ బస్సుల్లో ప్రయాణించేవారు నిర్ణీత సమయం కంటే ముందుగా బస్టాండ్కు చేరుకోవాలి. కొన్ని ప్రాంతాల నుంచి లగేజీతో రావడానికి ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. దీనిని గుర్తించిన ఆర్టీసీ, బల్క్గా టికెట్లు బుక్ చేసుకుంటే ఆ ప్రయాణికులకు ఇంటి నుంచి వారిని పికప్ చేసుకునే సదుపాయం తీసుకొచ్చింది.