sravanthi chokkarapu: స్రవంతి చొక్కారపు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె వరుసగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు, ఇటీవల హే బలవంత్ సినిమాలో కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో స్రవంతి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను, “బిగ్ బాస్ హౌస్లో అసలు ఎలా ఉంటుంది?” అని ప్రశ్నించాడు. దానికి స్రవంతి చాలా ఓపెన్గా సమాధానం ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..బిగ్ బాస్ తెలుగు అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పింది. “ఆ హౌస్లోకి వెళితే మనం అసలు ఎలాంటి వాళ్లమో, ఎంత వరకు స్ట్రాంగ్గా ఉండగలుగుతామో తెలుస్తుంది. మన ఎమోషన్స్ ఎలా బయటపడతాయో కూడా అర్థమవుతుంది,” అని చెప్పింది.
తాను బిగ్ బాస్ను ఒక ప్రాజెక్ట్లాగా అనుకొని వెళ్లానని స్రవంతి తెలిపింది. “అక్కడ ఉండే పరిస్థితులు మనని చాలా పరీక్షిస్తాయి. మనసు బలంగా ఉందా లేదా అనేది అక్కడే తెలుస్తుంది,” అని వివరించింది. అయితే అందరూ ఒకేలా ఉండరని కూడా స్పష్టం చేసింది.
“కొంతమంది మాత్రం ఎప్పుడూ నటిస్తూనే ఉంటారు. కెమెరాలు ఉన్నాయనే కాదు, వాళ్ల జీవితంలోనే నటిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు బిగ్ బాస్ హౌస్లో కూడా నటిస్తూనే ఉంటారు. వాళ్లను మార్చడం ఎవరి వల్లా కాదు,” అని స్రవంతి చెప్పింది. అందుకే బిగ్ బాస్కి వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఒకేలా ఫేమ్ రాదని ఆమె అభిప్రాయపడింది.
ఇక బిగ్ బాస్ తర్వాత జీవితం ఎలా ఉంటుందనే ప్రశ్నకు స్రవంతి సింపుల్గా సమాధానం ఇచ్చింది. “నేను బిగ్ బాస్కి వెళ్లే ముందు ఏ పని చేసానో, వచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తున్నాను. బిగ్ బాస్కి వెళ్లి వచ్చాను కదా, వేరే పెద్ద ప్రాజెక్టులు చేసేద్దాం అని నేను అనుకోలేదు,” అని చెప్పింది.
ఇంకా మాట్లాడుతూ, ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దానికే అతుక్కుపోవడం సరైంది కాదని చెప్పింది. “మాకిదే కావాలి, మేమిదే చేస్తాం అని ఫిక్స్ అయితే, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎవ్వరూ ఏం చేయలేరు. అలాంటి వాళ్లను దేవుడు కూడా ఏమీ చేయలేడు,” అంటూ సూటిగా చెప్పింది.
బిగ్ బాస్ హౌస్ వెనక ఉన్న నిజాలను స్రవంతి చొక్కారపు చాలా స్పష్టంగా బయటపెట్టిందని చెప్పవచ్చు.