Vijay – Amma Canteens: తమిళనాడు వ్యాప్తంగా పేదలకు తక్కువ ధరకే కడుపునిండా అన్నం పెట్టే ‘అమ్మ క్యాంటీన్ల’ (Amma Canteens) వ్యవస్థపై కొత్త ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ క్యాంటీన్ల రూపురేఖలను పూర్తిగా మార్చాలని ఆదేశించారు. ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రజా సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించిన విజయ్.. తాజాగా అమ్మ క్యాంటీన్ల పనితీరుపై చెన్నైలోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గత కొంతకాలంగా ఈ క్యాంటీన్లలో ఎదురవుతున్న సమస్యలు, ఆహార నాణ్యత, పారిశుధ్య లోపాలపై అధికారుల నుంచి నివేదికలు కోరారు. పేదలకు అందించే ఆహారంలో ఎలాంటి రాజీ పడకూడదని ఈ సందర్భంగా విజయ్ స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. అమ్మ క్యాంటీన్లలో అందించే టిఫిన్, భోజనం నాణ్యతను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. కేవలం ధర తక్కువగా ఉందని నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రజల ఆరోగ్యానికి మేలు చేసేలా మెనూలో కొన్ని మార్పులు చేయాలని, పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు వండాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
చాలా చోట్ల అమ్మ క్యాంటీన్ల భవనాలు శిథిలావస్థకు చేరడం, కూర్చోవడానికి సరైన వసతులు లేకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తక్షణమే అన్ని క్యాంటీన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, తాగునీటి సదుపాయం, మెరుగైన పారిశుధ్యం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే అమ్మ క్యాంటీన్లకు అవసరమైన వంటపాత్రలను తక్షణమే సమకూర్చాలని సూచించారు.
Also Read: బెంగాల్లో బీజేపీ సంచలనం.. ఇమామ్ల వేతనాలు రద్దు.. దీదీ అవినీతిపై విచారణ!
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత.. తన పుట్టిన రోజు సందర్భంగా 2013 ఫిబ్రవరి 24న ‘అమ్మ క్యాంటిన్లు’ ప్రారంభించారు. తొలుత చెన్నైలో ప్రారంభమైన ఈ క్యాంటిన్లు.. ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరించాయి. జయలలిత మరణం తర్వాత.. అధికారంలోకి వచ్చిన డీఎంకే అధినేత స్థాలిన్.. పేదల ఆకలి తీరుస్తున్న అమ్మ క్యాంటిన్లను తన ప్రభుత్వ హయాంలోనూ కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా టీవీకే అధినేత విజయ్ సైతం.. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. అమ్మ క్యాంటీన్ల అభివృద్ధికి ఆదేశాలు జారీచేయడం పట్ల తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో 237 అమ్మ క్యాంటిన్లు నిత్యం పేదల ఆకలిని తీరుస్తున్నాయి.
Also Read: ఏనుగుల మధ్య ఘర్షణ.. కాళ్ల కింద నలిగి చనిపోయిన మహిళ.. వీడియో ఇదే!