Elephant Clash: కర్ణాటకలోని కొడుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక వ్యన్యప్రాణి శిబిరాన్ని వీక్షించేందుకు వచ్చిన ఓ పర్యాటకురాలు.. ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ దృశ్యాలను చూసి నెటిజన్లు సైతం షాక్ కు గురవుతున్నారు.
చెన్నైకి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ దుబారే.. శిబిరంలో ఏనుగులకు స్నానం చేయిస్తుండగా తోటి పర్యాటకులతో పాటు సమీపంలో నిలబడి ఆసక్తిగా వీక్షిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాంచన్ అనే ఏనుగు.. మార్తాండ అనే మరో ఏనుగుపై దాడి చేసింది. దీంతో రెండూ ఒకదానిపైకి ఒకటి కాళ్లు రువ్వాయి. ఈ పోరాటంలో ఓ ఏనుగు.. అదుపుతప్పి సమీపంలో నిలబడి ఉన్న జ్యునేష్ పై పడిపోయింది. లేచి నిలబడే ప్రయత్నంలో మార్తాండ ఏనుగు.. జ్యునేష్ ను మరింతగా తొక్కేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఏనుగు ఘర్షణ దృశ్యాలను తోటి పర్యాటకులు చిత్రీకరించగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకలో కొడగు జిల్లాలో విషాదం.. ఏనుగుల ఘర్షణలో చెన్నై పర్యాటకురాలు మృతి
ఏనుగుల స్నానం చేస్తున్న సమయంలో నీటిలో రెండు ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణలో చిక్కుకుని చెన్నైకి చెందిన 33 ఏళ్ల పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. pic.twitter.com/hwWAi3s5fm
— BIG TV Breaking News (@bigtvtelugu) May 18, 2026
మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వన్యప్రాణుల విషయంలో కఠినమైన భద్రతా నియమాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. బంధించి ఉంచిన ఏనుగులకు శిక్షణ ఇచ్చినప్పటికీ వాటి ప్రవర్తనను అంచనా వేయడం చాలా కష్టమని మంత్రి అభిప్రాయపడ్డారు. కాబట్టి పర్యాటకులు ఏనుగుల తొండాలను తాకడం, ఆహారం పెట్టడం, సమీపంలో నిలబడటం వంటివి చేయకుండా నిరోధించాలని అధికారులకు సూచించారు. ఏనుగులకు సురక్షితమైన దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
Also Read: జోగి రమేశ్ vs పోలీసు అధికారి.. కేకలతో ఊగిపోయిన ఇరువురు.. వీడియో వైరల్!
ఇదిలా ఉంటే గత నెల చత్తీస్ గఢ్ లోని గౌరేలా పెండ్రా మార్వాహి జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అడవి ఏనుగు తొక్కేయడంతో 55 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆ తర్వాత కూడా కొద్ది రోజుల పాటు ఏనుగు స్వేచ్ఛగా ఆ ప్రాంతంలో తిరగడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో యూపీలోని బహ్రాయిచ్ జిల్లాలోని కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఒక ఏనుగు కాళ్ల కింద నలిగి.. 80 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు విడిచింది.
Also Read: ఇకపై ఇంట్లోనే కాదు.. గోడలపైనా మొక్కలు పెంచేయొచ్చు.. శాస్త్రవేత్తల క్రేజీ ఆవిష్కరణ!