రైతుబీమా పథకానికి రేవంత్ సర్కార్ మంగళం పాడిందని పదే పదే హరీశ్రావు చెబుతూ వస్తున్నాడు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరణ కూడా ఇచ్చాడు. మొత్తం ప్రీమియం అమౌంట్ చెల్లించామన్నాడు. కానీ హరీశ్ వినలేదు. వేదిక ఏదైనా.. ఈ రైతుబీమా గురించి ప్రస్తావిస్తూ వస్తున్నాడు.
ఈ పథకానికి సంబంధించిన ప్రీమియంను ఎల్ఐసీకి చెల్లించకపోవడంతో .. రైతు బీమా అమలు కావడం లేదని, ఈ సర్కార్ వచ్చినప్పటి నుంచి వందల మంది రైతుల చనిపోయారని, వీరికి ఆ రైతు బీమా మొత్తం దక్కకపోవడంతో ఆర్థికంగా మరింత చితికిపోయారని చెబుతూ వస్తున్నాడు. కానీ ఇవాళ మంచిర్యాలలో జరిగిన రైతు సదస్సులో కేటీఆర్ స్వయంగా రైతుబీమాపై మాట్లాడాడు.
ఓ రైతుకు రైతుబీమా వచ్చిందని, మిగిలిన వారికి అది అమలు కాలేదని చెప్పాడు. అంటే రైతు బీమా ఈ యేడాది కోసం ప్రీమియం చెల్లించారనే కదా అర్థం. ప్రతీ ఏడాదికొకసారి ఈ పథకానికి ప్రీమియం చెల్లించి రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది జూలై మాసాంతం నాటికి దీని గడువు పూర్తవుతుంది. ఆగస్టు మొదటి వారంలోగా ప్రీమియం చెల్లించి మళ్లీ ఆ రైతుబీమా ఖాతా నెంబర్లను రెన్యూవల్ చేయాల్సి వస్తుంది.
ఈ ప్రీమియం చెల్లించంలో మధ్యలో ఏదైనా జాప్యం జరిగితే.. ఆ కాలంలో రైతులెవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే.. వారికి ఇది వర్తించదు. దీంతో ఎంత ఆలస్యం చేస్తే అంత రైతులకు ఇది దక్కదన్న మాట. కేసీఆర్ పాలనలో కూడా సరైన సమయంలో ప్రీమియం చెల్లించని రోజులున్నాయి. దీంతో రైతులు కూడా ఆందోళన పడ్డారు. కొంత మందికి ఈ రైతు బీమా దక్కలేదు కూడా.
ప్రభుత్వంలో నిధులు లేకపోవడం, రైతుబీమా చెల్లింపులో ఆలస్యం అనేది ప్రతీసారి రొటీన్గా మారింది అప్పుడు. ఇప్పుడు ఈ సర్కార్లో కూడా ఆదిలో ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ తరువాత సరిగ్గా సమయానికి చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ అంశాన్ని కేటీయారే స్వయంగా ప్రకటించినట్టైంది. మొన్నటి దాకా హరీశ్ రావు చెప్పిందంతా అబద్దమనే విషయం దీనితో తేలిపోయింది. కానీ ఇప్పుడు ఈ పథకానికి ఏడాది పూర్తకావడానికి ఎన్నో రోజులు లేదు. ఈ నెలాఖరులోగా టర్ము పూర్తవుతుంది. ఆగస్టు మొదటి వారంలోపే ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆలస్యం చేస్తే బాధిత రైతు కుటుంబాలకు దక్కాల్సిన ఆర్థిక సాయం దక్కదు.