Delhi Blast case update: ఢిల్లీలో పేలుడు ఘటన అనేక కొత్త అంశాలను తెరపైకి తెస్తోందా? ఉగ్ర కుట్రలకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయా? దేశవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేశారా? ఈ మొత్తం ఎపిసోడ్కు అల్-ఫలాహ్ యూనివర్సిటీ వేదికైందా? ఉమర్కు చెందిన మూడు డైరీలు వెనుక అసలేం జరిగింది? జరుగుతోంది.
ఢిల్లీ పేలుడు కేసులో కీలకంగా డైరీలు
ఢిల్లీ పేలుడు ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధానమైన నాలుగు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను ఎంచుకున్నారట. అల్-ఫలాహ్ యూనివర్సిటీ లోని రూమ్ నెంబర్- 13లో పేలుళ్లకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. ఉమర్, ముజమ్మిల్కు చెందిన రూమ్ నెంబరు నాలుగులో మూడు డైరీలు కనిపించడం కలకలం రేపింది.
ఢిల్లీ పేలుళ్ల కేసు నిందితులు డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజమ్మిల్ డైరీలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లభించిన డైరీల్లో కోడ్లో మేటర్ ఉంది. వాటిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు దర్యాప్తు అధికారులు. నవంబర్ 8 నుంచి 12 మధ్య భారీ పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. రెండేళ్లుగా పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. ఆ డైరీలో దాదాపు 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి.
టార్గెట్ నాలుగు ప్రాంతాలు, అంతా కార్లతో బీభత్సం
వారిలో ఎక్కువ మంది జమ్మూకాశ్మీర్, ఫరీదాబాద్కు చెందినవారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. పేలుళ్ల కోసం ఐ 20, ఎకోస్పోర్ట్తోపాటు మరో రెండు పాత కార్లను సిద్ధం చేసినట్టు సమాచారం. అందులోని భాగంగానే ఐ20 కారులో ఎర్రకోట వద్ద పేలుడు జరిగింది. ఎకోస్పోర్ట్ కారుని పోలీసులు స్వాధీనం చే చేశారు. మిగతా రెండు కార్ల కోసం తనిఖీలు ముమ్మరం చేశారు.
ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు కేసు విచారణ వేగంగా చేస్తోంది NIA. ఢిల్లీ కారు పేలుడు కేసులో మూడో కారుని ట్రేస్ చేశారు అధికారులు. మారుతి బ్రీజా కారును అల్ ఫలాహ్ యూనివర్సిటీ వద్ద పార్క్ చేశారు నిందితులు. ఇటీవల అరెస్టయిన మహిళా డాక్టర్ షాహీన్ పేరు మీద రిజిస్టరై ఉంది. నిందితుల బృందాలు జంటగా కదలాలని భావించాయి. ఏకకాలంలో దాడుల కోసం అధునాతన పేలుడు పరికరాలను తీసుకెళ్లాలని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ALSO READ: ఢిల్లీలో మరో పేలుడు.. భయంతో జనాలు పరుగులు
పేలుళ్లు అమలకు 20 లక్షల రూపాయలు సేకరించాడు ఉమర్ అండ్ గ్యాంగ్. గురుగ్రామ్, నూహ్ ప్రాంతాల నుంచి 20 కేజీల ఎన్పీకే ఫెర్టిలైజర్ కొనుగోలు చేశారు కూడా. అల్-ఫలాహ్ యూనివర్సిటీ హాస్పిటల్లోని ఓ కంపౌండర్ సహా పలువురు యూనివర్సిటీ సిబ్బందిని విచారిస్తున్నారు పోలీసులు. కార్యకలాపాలను సురక్షితంగా సమన్వయం చేయడానికి ఉమర్ ఇద్దరు నుండి నలుగురు సభ్యులతో కూడిన ఓ యాప్ గ్రూప్ని క్రియేట్ చేశాడు. మరోవైపు ఢిల్లీ పోలీసులు CCTV ఫుటేజ్లో ఘటన ప్రాంతంలో మృతి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ విజువల్స్, ఎర్రకోట సమీపంలోని తుర్క్మాన్ గేట్ మసీదు వద్ద కనిపించిన ఫోటోలను రిలీజ్ చేశారు.