Cyber Fraud: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో.. సైబర్ నేరగాళ్ల ఘరాన మోసం వెలుగుచూసింది. స్థానిక ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్ను లక్ష్యంగా చేసుకుని, తాము ఏసీబీ అధికారులమని నమ్మించి మోసగాళ్లు పెద్ద ఎత్తున డబ్బు దోచుకున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం సమయంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడిన వ్యక్తులు తమను ఏసీబీ అధికారులు అని పరిచయం చేసుకున్నారు. ‘మీ ఆఫీసుపై ఫిర్యాదులు వచ్చాయి. త్వరలో మీపై రైడ్ చేయబోతున్నాం అంటూ.. అధికారుల పేరుతో మాట్లాడిన నేరగాళ్లు, రైడ్ జరగకుండా ఉండాలంటే మూడు లక్షలు వెంటనే వారి ఖాతాకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
అకస్మాత్తుగా వచ్చిన ఈ కాల్తో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ తడబడిపోయారు. నిజంగానే ఏసీబీ అధికారులు మాట్లాడుతున్నారని భావించి, పరిస్థితి తీవ్రంగా మారకముందే కొంత మొత్తం చెల్లించాలనుకున్నారు. వెంటనే ఆయన పలు బ్యాంక్ ఖాతాల ద్వారా మొత్తం రెండు లక్షల రూపాయలను ఫోన్పే ద్వారా పంపించారు. తర్వాత నేరగాళ్లు మరో లక్ష రూపాయలు కూడా పంపాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
ఈ దశలో శ్రీనివాస్కు అనుమానం కలిగింది. నిజంగా ఏసీబీ అధికారులు ఇలా డబ్బు అడగరని గుర్తించి, వెంటనే అసలు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఆ విచారణలో తాము ఎలాంటి కాల్ చేయలేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. అప్పుడు శ్రీనివాస్కు తాను మోసపోయినట్టు స్పష్టమైంది.
ట్రాన్సాక్షన్ వివరాలు సేకరించిన ఆయన, మొగల్తూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ వివరాలు, ఫోన్పే లావాదేవీలను ట్రాక్ చేస్తూ నిందితుల గురించి సమాచారం సేకరిస్తున్నారు.
Also Read: డిజిటల్ అరెస్ట్ ట్రాప్.. నిర్మలా సీతారామన్ ఫోర్జరీ సంతకంతో వృద్ధురాలికి రూ. 99 లక్షలు టోపీ!
ఈ తరహా కాల్స్ ద్వారా ఇప్పటికే పలువురు ప్రభుత్వాధికారులను లక్ష్యంగా చేసుకుని.. సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.