Chennai: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విజయ్ పార్టీ టీవీకే గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బున్నవారికే అనేవాదన బలంగా ఉంది. కానీ విజయ్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు దిగువ స్థాయి వ్యక్తులు ఎక్కువమంది ఉన్నారు. వారిలో తెలుగు అమ్మాయి కీర్తన ఒకరు. ఏకంగా శివకాశి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారామె.
విజయ్ పార్టీలో తెలుగు యంగ్ మహిళ కీర్తన
ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడారు కీర్తన. ఎన్నికల్లో తాను గెలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలు మార్పు కోరినట్టు మనసులోని మాట వ్యక్తం చేశారు. టపాసులకు కేంద్రంగా మారిన ప్రాంతం శివకాశి నియోజకవర్గం నుంచి గెలవడం మాటల్లో చెప్పలేనని అన్నారు. సామాన్యుడి మాదిరిగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఆలోచన చేస్తారని, అందుకే తనకు టికెట్ వచ్చిందన్నారు.
ఈ రోజుల్లో సామాన్యులకు టికెట్లు ఎవరిస్తారని అన్నారు. తెలుగు రాష్ట్రాలు-తమిళనాడు రాజకీయాలు వేర్వేరని మనసులోని మాట బయటపెట్టారు. కీర్తనా అసలు పేరు కీర్తనా సంపత్. ఇప్పుడు ఆమె జీవతం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మహిళ. రాజకీయ మూలాలు అస్సలు లేవు.
శివకాశి నుంచి అసెంబ్లీలో అడుగు, టీడీపీ-పీకే టీమ్లో ఆమె
విరుద్నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి ఆమె సొంతూరు. డిగ్రీ వరకు అక్కడే చదువుకున్న ఆమె, పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత డేటా అనలిస్ట్గా, పొలిటికల్ కన్సల్టెంట్గా అవకాశాలు వచ్చాయి. రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్-ఐప్యాక్ టీమ్లో కీర్తన చేశారు.
ఆ తర్వాత గత గోవా, బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల్లో తెర వెనుక వ్యూహ రచనలో కీలక పాత్ర పోషించారు. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు కోసం పని చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలో పని చేశారు. ఆ సమయంలో తెలుగు భాషపై పట్టు సంపాదించుకున్నారు ఆమె.
వివిధ రాష్ట్రాల రాజకీయ నేతల గెలుపు కోసం వ్యూహాలు రచించిన కీర్తన, తన సొంత ప్రాంతంలో సమస్యలు ఆమెని ఆలోచింపజేశాయి. టపాసులకు కేంద్రమైన శివకాశిలో నిత్యం జరిగే ప్రమాదాలు, కార్మికుల మరణాలు ఆమెని తీవ్రంగా కలచివేశాయి. లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి సొంతూరుకు సేవ చేయాలని డిసైడ్ అయ్యారు.
ALSO READ: విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు.. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ!
సోషల్ మీడియా ద్వారా స్థానిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం మొదలుపెట్టింది కీర్తన. స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. తక్కువ సమయంలో ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంది. ఆమె ప్రజాదరణను గమనించిన టీవీకే అధినేత విజయ్, ఎన్నికలకు నెల రోజుల ముందు శివకాశి టికెట్ ను కీర్తనకు ఓకే చేశారు.
శివకాశి ప్రాంతం కాంగ్రెస్కు కంచుకోట. అక్కడ ఎంపీ అభ్యర్థులంతా కాంగ్రెస్ నేతలు గెలుస్తుంటారు. అలాంటి ప్రాంతంలో తనదైన శైలిలో ప్రచారం చేసింది ఆమె. ఆ నియోజకవర్గంలోని తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి తెలుగులో ప్రచారం చేశారు. ఫలితంగా శివకాశి నియోజకవర్గం చరిత్రలో తొలిసారి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. టీవీకే పార్టీ తరపున బరిలోకి దిగన కీర్తన, కాంగ్రెస్కు చెందిన తన సమీప అభ్యర్థి అశోకన్ జిని 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. శివకాశి నుంచి నేరుగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మహిళా పేరు సొంతం చేసుకున్నారు.