ఇప్పుడు అంతా కవిత కొత్త పార్టీపైనే డిస్కషన్. టీఆరెస్ పేరును ఆమె దక్కించుకోవడమే మొదటి విజయంగా ఆమె టీం భావిస్తోంది. ఈ పరిణామం వారిలో సంతోషాన్ని నింపింది. అయితే కవిత తన రాజకీయ వ్యూహంలో భాగంగా వేస్తున్న ప్రతి అడుగూ ప్రాధాన్యత సంతరించుకుంటున్నది. ఆమె మాట్లాడే ప్రతీ మాటలో అర్థాన్ని వెతుకుతున్నారు. ఆరోపణలు, స్ట్రాటజీ వెనుక ఎవరున్నారనే అనుమానంతో చూస్తున్నారు. అయితే, తాజాగా ఆమె పార్టీ ఆవిర్భావం నాడు చేసిన ప్రసంగంలో తండ్రి కేసీఆర్ పై చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఆమెకు మైలేజీ రాకపోగా.. ఇది నష్టం చేకూర్చేదిగా భావిస్తున్నారు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే విషయంపై కవితను తప్పుబట్టారు. తండ్రీకూతురుకు మధ్య ఉన్న అనురాగం.. ప్రేమానుబంధాలను గుర్తు చేయడం…ఆమెను రాజకీయంగా ఇరకాటంలో పెట్టేవిగా ఉన్నావనే భావన వ్యక్తమవుతోంది. మారిన మనిషి అని.. ఆమె సుతిమెత్తగా అన్నా..అది తిట్టుగానే భావిస్తున్నారు. ఆయనో మర మనిషి అని విమర్శించినా అది దూషణ కిందే తీసుకుంటున్నారు. అంటే.. ఎంత దుర్మార్గుడైనా తండ్రి తండ్రే కదా! అదీ కూతురంటే ప్రేమానురాగాలు ఒలకబోసే తండ్రిని రాజకీయంగా కించపరిచడం.. ఆయనను అవమానించడం సరైంది కాదు..అనే భావన మెజారిటీ వర్గాల నుంచి వస్తోంది.
ఈ మధ్య కేటీఆర్ కూడా ఓ ప్రైవేటు ప్రోగ్రాంకు పోయినప్పుడు ఇదే విషయాన్ని వ్యూహంలో భాగంగా, ఉద్దేశ్య పూర్వకంగా కామెంట్లు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. తండ్రీ కొడుకు మధ్య కన్నా.. తండ్రీ కూతురు మధ్యే మంచి బాండింగ్ ఉంటుందని, కూతురు చొరవ తీసుకుంటుంది కానీ.. కొడుకుకు భయం ఉంటుందని వ్యాఖ్యానించారు. అంటే.. తండ్రి పట్ల కూతురు ఎంతో ప్రేమతో ఉండాల్సింది పోయి.. కవిత తిడుతున్నది అనే విషయాన్ని జనాలకు గుర్తు చేయాలనుకున్నాడు కేసీఆర్. ఇదే విధంగా అది ప్రచారంలోకి వెళ్లింది. దీనిపైన కవిత వర్గం కౌంటర్ ఇచ్చినా.. ఆ సెంటిమెంట్ ముందు కవితకే మైనస్ మార్కులు పడుతున్నాయి.
తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదని, దీనికి కారణం ఆయన చుట్టూ ఉన్న హరీశ్, కేటీఆర్ లాంటి నేతలేనని ఆమె అనడం వరకు ఓకే. కానీ కేసీఆర్ మారడు..బయటకు రారు.. లాంటి మాటలు నిజమే అయినా.. ఆమె నోటి వెంట రావడాన్ని అది రాజకీయ కోణంలో కాకుండా.. పక్కా తండ్రీ కూతురు మధ్య జరిగే సంఘర్షణగానే చూస్తున్నారు. ఇక్కడే కవితకు మైనస్ మార్కులు పడుతున్నాయి. బీఆరెస్ పార్టీ లోపాలను, జనాలకు దూరమైన విధానాన్ని ఎండగట్టి.. తన పార్టీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారో.. అవి విడమర్చి చెప్పడం ద్వారా.. ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారా ఆమె బలోపేతం కావొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనే ఓ ఆయుధం కావాల్సిన తరుణంలో కేసీఆర్ను దూషించి.. వైరి పక్షానికి పావుగా మారే ఈ రాజకీయ వ్యూహం సరైంది కాదనే భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది.
దీనిపై కవిత కూడా సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పాలనా విధానాలపై పరోక్షంగా విమర్శించే విధానమే కరెక్టుగా ఉందని, నేరుగా కేసీఆర్ పేరుతో ఏం మాట్లాడినా.. అది బూమరాంగే అవుతుందనే సందేశం ఆమెకు వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఆమె మున్ముందు ఎలా వెళ్తారు? తను అనుకున్న పంథాతోనే కొనసాగుతారా? తండ్రి విషయంలో కొంచెం విమర్శన తీరును మారుస్తారా? చూడాలి.